రెంకోజీ ఆలయంలో ఉన్నది బోస్ అస్థికలేనా? డీఎన్ఏ పరీక్షలకు ప్రభుత్వం ఎందుకు జంకుతోంది?
సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై మిస్టరీ ఇన్నాళ్లయినా వీడలేదు.. వీడదు కూడా! మిస్టరీని కాపాడే బాధ్యతను మన రాజకీయ నాయకులు జాగ్రత్తగా కాపాడుతూ వస్తారు.
సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై మిస్టరీ ఇన్నాళ్లయినా వీడలేదు.. వీడదు కూడా! మిస్టరీని కాపాడే బాధ్యతను మన రాజకీయ నాయకులు జాగ్రత్తగా కాపాడుతూ వస్తారు. ఎన్నికలప్పుడు మాత్రం నేతాజీని తెరముందుకు తెచ్చి పబ్బం గడుపుకుంటూ వస్తున్నారు. ఇండియా గేట్ దగ్గర నేతాజీ సుభాష్చంద్రబోస్ విగ్రహావిష్కరణ జరిగింది. సంతోషం.. మరి రిపబ్లిక్ పరేడ్లో నేతాజీ శకటానికి ఎందుకు చోటివ్వలేదు? సరే చోటివ్వకపోవడానికి బెంగాల్లో ఉన్నది మమతా బెనర్జీ ప్రభుత్వమే కారణమని అనుకుందాం! అధికారంలోకి రాగానే నేతాజీ అదృశ్యం మిస్టరీని ఛేదిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయడం లేదు? నేతాజీ చితాభస్మం టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఒక పాత్రలో వుందని, దాని సంరక్షణకు భారతప్రభుత్వం అద్దె చెల్లిస్తోందని తెలుసు. ఆయన అస్థికలుగా చెబుతున్న వాటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు ఆ ఆలయ పూజారి అనుమతి ఇచ్చారని నేతాజీ సోదరుడు శరత్ చంద్రబోస్ మనవరాలు మాధురీ బోస్ అంటున్నారు. 2005లోనే ఈ మేరకు లేఖ రాశారని చెబుతున్నారు. బోస్ మరణంపై అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన ముఖర్జీ కమిటీ దాన్ని ఎందుకు పట్టించుకోలేదన్నది మాధురీ బోస్ ప్రశ్న. ముఖర్జీ నివేదికలో దాని ఊసే లేదని తెలిపారు. డీఎన్ఏ టెస్ట్లకు సంబంధించి రెంకోజీ ఆలయ అధికారులు మౌనం వహించడంతో తాము ముందుకు వెళ్లలేకపోయామని ముఖర్జీ కమిషన్ పేర్కొంది. అది నిజం కాదంటున్నారు మాధురి. జపాన్ భాషలో ఉన్న పూజారి లేఖను అనువదించి చూశామని, అందులో డీఎన్ఏ టెస్ట్కు తాను అనుమతి ఇస్తున్నానని పూజారి స్పష్టంగా పేర్కొన్నట్టు ఉందని ఆమె అన్నారు. సుభాష్చంద్రబోస్ అదృశ్యంపై న్యాయమూర్తి ఎం.కె.ముఖర్జీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ తన నివేదికను 2006లో పార్లమెంట్కు సమర్పించింది. అందులో సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని తెలపడంతో ఆయన అదృశ్యంపై మరిన్ని అనుమానాలు వచ్చాయి. నేతాజీ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారని, సన్యాసిగా తిరుగుతున్నారని, రష్యా ప్రభుత్వం జైల్లో ఉంచిందని, ఇలా ఎవరికి వారు తమకు తోచిన విధంగా కథలు అల్లారు. అసలు రెంకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు నేతాజీవే కావని ముఖర్జీ కమిషన్ అంటోంది. నేతాజీవి కానప్పుడు ఆలయ పూజారీ లేఖ మాటేమిటి? పరీక్షలకు తాను సహకరిస్తానని, ఇదే విషయాన్ని జపాన్లోని భారత రాయబారి ఎం.ఎల్.త్రిపాఠి సమక్షంలోనూ చెప్పానని పూజారి నిచికో మోచీచుకీ రాసిన లేఖలో ఉంది. దీన్ని ఎందుకు బహిరంగం చేయడం లేదో, ఎందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడం లేదో తెలియడం లేదని మాధరీబోస్ అంటున్నారు. టెస్ట్లు జరపకపోవడంతో ఆ అస్థికలు నేతాజీవేనని తాను బలంగా నమ్ముతున్నానని ఆ లేఖలో పూజారి చెప్పడం గమనార్హం. పూజారి నిద్రపోయే సమయంలోనూ అస్థికల కలశాన్ని తన దగ్గర పెట్టుకునేవారట! ఎవరైనా వాటిని మార్చి వేస్తారేమోనన్న భయంతో అలా చేసేవారట. నిజానికి అక్కడ ఉన్నవి నేతాజీ అస్థికలో కావో తెలుసుకోవడానికి ఒక్క డీఎన్ఏ పరీక్ష చాలు కదా! స్వయానా ఆయన కూతురే అప్పట్లో డిమాండ్ చేశారు. మరి ఇప్పటి వరకు దేశాన్ని ఏలిన ప్రభుత్వాలు ఎందకు ఆ పని చేయలేదు? బోస్ ఫైళ్లను డీక్లాసిఫై చేసి వాస్తవాలు బయటపెడతామని అధికారంలోకి వచ్చిన వెంటనే మోదీ మాట ఇచ్చారు. కానీ ఆ మాటలను నిలబెట్టుకోలేదు. అప్పడే సమాచార హక్కు కింద ఎవరో ఈ విషయాన్నిఅడిగితే.. భారత దేశానికి ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు దెబ్బ తింటాయి కాబట్టి విడుదల చేయలేమని జవాబిచ్చారు. మరి బెంగాల్ ఎన్నికలు రాగానే కొద్ది కొద్దిగా ఆ ఫైళ్లను విడుదల చేశారు. అప్పుడెందుకు దౌత్య సంబంధాలు చెడిపోతాయని ప్రభుత్వం అనుకోలేదు? రహస్య ఫైళ్లను డిక్లాసిఫై చేయడానికి వేరే దేశాలలో టైమ్ లిమిట్ ఉంటుంది. మన దగ్గర లేదు. అందుకే ఎన్నాళ్లు దాచి పెట్టినా ఎవరూ అడగలేరు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాలు బోస్ మరణంపై మూడు కమిషన్లు వేశాయి. 1956లో వేసిన కమిటీకి చంద్రబోస్తో కలిసి పని చేసిన షా నవాజ్ నేతృత్వం వహించారు. విమాన ప్రమాదం తర్వాత బోస్ చనిపోయారని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదకను ప్రభుత్వం ఆమోదించింది కానీ బోస్ ఫ్యామిలీ మాత్రం తిరస్కరించింది. 1970లో జస్టిస్ జీడీ ఖోస్లా నేతృత్వంలో మరో కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక కూడా ఇదే చెప్పింది. 1977 అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ ప్రభుత్వం ఆ నివేదికను తిరస్కరించింది. 2000 సంవత్సరంలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంకే ముఖర్జీ నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ మాత్రం నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదని, రెంకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు ఓ జపాన్ సైనికుడిదని నివేదిక ఇచ్చింది. 2004లో వచ్చిన యూపీఏ ప్రభుత్వం ఈ నివేదికను తిరస్కరించింది. నిజానికి బోస్ గురించి పరిశోధించమని ఓ బెంగాలీ వ్యక్తిని అడిగితే ఇలాంటి నివేదికలే వస్తాయి. బోసు చనిపోయాడని ముఖర్జీ నివేదిక ఇచ్చి ఉంటే బెంగాల్లో ఆయనపై బోల్డంత వ్యతిరేకత వచ్చేది. ఆయనను దుమ్మేత్తి పోసేవారు. రెంకోజీ ఆలయంలో ఉన్నది బోస్ చితాభస్మమేనని నెహ్రూ, ఇందిరాగాంధీలే కాదు వాజపేయి కూడా నమ్మారు. అందుకే జపాన్ వెళ్లినప్పుడు వీరంతా ఆ ఆలయాన్ని దర్శించి వచ్చారు. అప్పట్లో జపాన్ వెళ్లిన మోదీ మాత్రం అక్కడకు వెళ్లలేదు. వెళితే ఆమోద ముద్ర వేసినట్టు అవుతుందని అనుకున్నారేమో! అయ్యా.. అస్థికలు, చితాభస్మం సుభాష్ చంద్రబోస్వేనని, పట్టుకెళ్లండని జపాన్ ఆలయ అధికారులు అంటున్నా.. మనవాళ్లకు మాత్రం వాటిని తెచ్చేందుకు ధైర్యం చాలడం లేదు. తెస్తే బోస్ మరణాన్ని అంగీకరించినట్టు అవుతుంది. అప్పుడు బెంగాల్లో ఆందోళనలు రేగుతాయి. 1976లో భారత ప్రభుత్వం తెచ్చే ఆలోచన చేసినప్పుడు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేశ్వర్ ఇదే విషయాన్ని చెప్పారు. 2007లో ప్రధాని మన్మోహన్ సింగ్కు ఈ ఆలోచన వచ్చినా ఎందుకో జడిశారు. ఒకవేళ ముఖర్జీ కమిషన్ చెప్పినట్లుగా అవి జపాన్ సైనికుడి బూడిదే అనుకుందాం! మరి జపాన్ సైనికుడి చితాభస్మం సంరక్షణ కోసం విదేశాంగ శాఖ జపాన్కు అంతేసి డబ్బును ఎందుకు చెల్లిస్తున్నట్టు? ఈ ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం నుంచి సమాధానం రాదు.. మొత్తంగా ఓ చిన్నపాటి డీఎన్ఏ టెస్ట్ ద్వారా వాస్తవాలు తెలిసిపోతాయి. కానీ ప్రభుత్వం ఆ పని చేయదు.