The Supreme Court: అబార్షన్లపై కీలక తీర్పిచ్చిన సుప్రీంకోర్టు.. పెళ్లయినా, కాకపోయినా అది వారి హక్కు అంటూ..
Abortion: అత్యాచారం అంటే సమ్మతి లేకుండా జరిగే కలయిక. భర్తతోనూ లైంగిక వేధింపులు ఎదుర్కోవచ్చు. మహిళ సమ్మతి లేకుండా జరిగే కలయికతోనూ ఆమె బలవంతంగా గర్భం దాల్చొచ్చు. బలవంతంగా గర్భం దాల్చితే అది అత్యాచారం కిందే లెక్క.
బలవంతపు గర్భధారణ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. చట్టప్రకారం మహిళలందరికీ సురక్షితంగా అబార్షన్ చేయించుకునే హక్కుందని తీర్పు చెప్పింది. అవాంఛిత గర్భాన్ని తొలగించే హక్కు లేదని చెప్పలేదని పేర్కొంది. MTP చట్టం నిబంధనల ప్రకారం పెళ్లయినా, కాకపోయినా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేయించుకునే హక్కుందని, ఈ విషయంలో వివాహితులు, అవివాహితులు అని వివక్ష చూపించడం నేరమని, రాజ్యాంగం ఎదుట అది నిలవజాలదని సుప్రీం కోర్టు చెప్పుకొచ్చింది.
పెళ్లయిన వారిని 24 వారాల లోపు అబార్షన్కు అనుమతిస్తూ.. అవివాహితులను అనుమతించకపోవడం సరికాదని వెల్లడించింది. ఇప్పుడు కాలం మారింది. చట్టం స్థిరంగా ఉండకూడదు. సామాజిక వాస్తవాలకు అనుగుణంగా నిబంధనలు మారుతుంటాయని కోర్టు స్పష్టం చేసింది.
ఇదే క్రమంలో వైవాహిక అత్యాచారాలను సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. అత్యాచారం అంటే సమ్మతి లేకుండా జరిగే కలయిక. భర్తతోనూ లైంగిక వేధింపులు ఎదుర్కోవచ్చు. మహిళ సమ్మతి లేకుండా జరిగే కలయికతోనూ ఆమె బలవంతంగా గర్భం దాల్చొచ్చు. బలవంతంగా గర్భం దాల్చితే అది అత్యాచారం కిందే లెక్క. ఇలాంటి గర్భధారణల నుంచి మహిళలను కాపాడాల్సిన ఆవశ్యతక ఉందని కోర్టు అభిప్రాయపడింది.