AIADMK EPS Vs OPS: పార్టీలో పట్టు కోల్పోయిన ఓపిఎస్.. పన్నీర్ గెంటివేతకు ఈపీఎస్ వర్గం నిర్ణయం
AIADMK Leadership Row: పార్టీ చీఫ్ పదవి కోసం ఐదేళ్లుగా ఓపిఎస్, ఈపీఎస్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అప్పట్లో తాత్కాలిక పరిష్కారంతో ఈపీఎస్ చీఫ్ గా.. ఓపిఎస్ డిప్యూటీ చీఫ్ గా కొనసాగుతూ వస్తున్నారు.
AIADMK – EPS Vs OPS: అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం కోసం జరుగుతున్న పోరు కొత్త మలుపు తీసుకుంది. పార్టీ చీఫ్ కోసం జరుగుతున్న పోరాటంలో ఈపీఎస్(ఎడపాటి పళనిస్వామి) మరోసారి తన పట్టు నిలుపుకున్నారు.. ఓపిఎస్(ఓ పన్నీర్ సెల్వం) చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. జయలలిత మరణాంతర పరిణామాలతో అన్నాడీఎంకే లో అనేక వివాదాలు చోటుచేసుకున్నాయి. జయలలిత సన్నిహితురాలు శశికళ పార్టీ పగ్గాలు చేపట్టారు. సీఎం కావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చివరి క్షణంలో కోర్టు తీర్పు రూపంలో అవకాశం చేజారిపోయింది. ఆ వెంటనే పార్టీలో స్థానం కూడా దక్కలేదు. దీంతో పార్టీ చీఫ్ పదవి కోసం ఐదేళ్లుగా ఓపిఎస్, ఈపీఎస్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అప్పట్లో తాత్కాలిక పరిష్కారంతో ఈపీఎస్ చీఫ్ గా.. ఓపిఎస్ డిప్యూటీ చీఫ్ గా కొనసాగుతూ వస్తున్నారు.
అయితే ఇటీవల వివాదం మళ్లీ మొదటికొచ్చింది. పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి పార్టీ చీఫ్ ఎన్నిక కోసం ఈపీఎస్ రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే కోర్టు పిటిషన్ తో 23న జరిగిన సమావేశంలో పార్టీ చీఫ్ ఎన్నిక జరగకుండా అడ్డుపడ్డారు ఓపిఎస్. అయితే న్యాయపరమైన సమస్యలు లేకుండా మరోసారి సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పదవి దక్కించుకునేందుకు ఈపీఎస్ మరోసారి సిద్ధమయ్యారు. జూలై 11న సమావేశం జరగనుంది. ఈలోపు ఓపిఎస్, ఆయన వర్గంపై చర్యలకు సిద్ధమైంది ఈపీఎస్ వర్గం. ఓపిఎస్ కు ఉద్వాసన దిశగా చర్యల్లో భాగంగా పార్టీ కార్యాలయంలో కీలక నేతలు భేటి అయ్యారు. పార్టీ వ్యతిరేక విధానాలపై సీరియస్ అయిన నేతలు శశికళ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నేతల ఏకాభిప్రాయానికి వచ్చారు.. ఓపిఎస్, ఓపిఎస్ వర్గం నేతల బహిష్కరణకు నిర్ణయం తీసుకున్నారు.11 న జరిగే సర్వసభ్య సమావేశంలో అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి జయ్ కుమార్ మీడియాకు ప్రకటించారు.
అయితే పార్టీ బైలాను ఈపీఎస్ వర్గం ఉల్లంఘిస్తోందంటూ ఓపీఎస్ ఆరోపించారు. అన్నాడీఎంకే శ్రేణులు తన వెంటే ఉన్నట్లు ఆయన ప్రకటించుకున్నారు. తనను పార్టీ కో ఆర్టినేటర్ పదవి నుంచి తప్పించనున్నట్లు ఈపీఎస్ వర్గం నేతలు చేస్తున్న వ్యాఖ్యలను స్పందించారు. కో ఆర్టినేటర్, కో కోఆర్టినేటర్కు మాత్రమే పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసే అర్హత ఉంటుందని అన్నారు.
మొత్తానికి ఓపిఎస్ తన తొందరపాటు చర్యలతో మరో సారి విఫలమయ్యారన్న చర్చ తమిళనాడు రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. గతంలోనూ ఓపిఎస్ ప్రభుత్వాన్ని పడగొడతానని సవాల్ విసిరి ఈపీఎస్ సర్కార్ ని ఏమీ చేయలేక రాజీ అయ్యారు. ఇప్పుడు జరగబోయే సమావేశంలో అధికారిక ప్రకటన తర్వాత ఏం చేయనున్నారో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..