EPS vs OPS: అన్నా డీఎంకేలో ఏక నాయకత్వ పోరు.. రెండాకుల పార్టీ రెండు ముక్కలవుతుందా?
ఎడిఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న దివంగత జయలలిత మరణాంతర పరిణామాలు అనేక మలుపులు తిరిగాయి. అమ్మ తర్వాత చిన్నమ్మగా పిలవబడే శశికళ అన్నీ తానే పార్టీని ముందుకు నడిపించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
Tamil Nadu Politics: తమిళ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.. రెండాకుల పార్టీ(AIADMK) రెండు వర్గాలుగా విడిపోయింది. ఆ పార్టీ కొత్త చీఫ్ నియామకం కేంద్రంగా వివాదం రాజుకుంది. ఇప్పటి దాకా మాజీ ముఖ్యమంత్రులు ఈపీఎస్, ఓపిఎస్ లు పార్టీ బాధ్యతలు చేపడుతన్నారు. అయితే ఇప్పుడు పార్టీలో ఏక నాయకత్వం కోసం ప్రయత్నాలు మొదలుకావడం కాక రేపుతున్నాయి. విషయం కోర్టు దాకా వెళ్ళింది. పార్టీ చీఫ్ ఎన్నిక వాయిదా పడుతుందా..? యధావిధిగా జరుగుతుందా..? కోర్టు ఏం చెప్పనుంది..? తమిళనాడు రాజకీయ వర్గాల్లో దీనిపైనే ఇప్పుడు హాట్ చర్చ నడుస్తోంది.
ఎడిఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న దివంగత జయలలిత మరణాంతర పరిణామాలు అనేక మలుపులు తిరిగాయి. అమ్మ తర్వాత చిన్నమ్మగా పిలవబడే శశికళ అన్నీ తానే పార్టీని ముందుకు నడిపించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కోర్టు తీర్పు పర్యవసానం చిన్నమ్మ జైలుకెళ్లాక పలనీ స్వామి శశికళ కు ఎదురు తిరిగారు. అంతా బాగుంది అనుకుంటుండగా 2017 లో మాజీ సీఎం పన్నీర్ సెల్వం పార్టీలో చీలిక ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు వివాదం నడిచింది. ఆ తర్వాత ఓపిఎస్, ఈపీఎస్ ఇద్దరి మధ్య ఏదో ఓ రకంగా సయోధ్య కుదిరింది. పార్టీ బాధ్యతలు ఇద్దరూ కలిసి నిర్వర్తిస్తున్నారు.
అయితే ఇటీవల పార్టీలోకి శశికలను రప్పించాలని ఓపిఎస్ తెరవెనుక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. తాజాగా పార్టీ లో ఏక నాయకత్వం రావాలని అది నేనే కావాలని ఓపిఎస్ ప్రయత్నాలు చేశారు. అంతే దీటుగా ఈపీఎస్ కూడా తన వ్యూహాలకు పదును పెట్టారు. ఈ నెల 23 న పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి తనకు అనుకూలంగా ఫలితం ఉండేలా రంగం సిద్ధం చేసుకున్నారు. ఉన్నట్టుండి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు ఓపిఎస్. సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించకూడదని స్టే ఇవ్వాలని కోరారు. బై లాకు విరుద్ధంగా సమావేశం జరుగుతోంది అనేది పన్నీర్ వాదన.
ఇది ఇలా ఉండగా పళనీ కూడా కోర్టుకు వెళ్లారు. సమావేశం సజావుగా జరపడం కోసం భద్రత కల్పించాలని కోరుతూ పిటిషన్ వేశారు. సభను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఈపీఎస్ ఆరోపిస్తున్నారు. రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు రేపు(22 జూన్) ఇద్దరి వాదనలను విననుంది. అయితే కోర్టు తీర్పు ఎవరికి అనుకూలం.. ఎవరికి ప్రతికూలంగా రాబోతోంది.. ఇపుడు తమిళనాట ఇదే హాట్ టాపిక్. కోర్టు తీర్పు తర్వాత ఎఐడిఎంకేలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయన్నది ఆసక్తి రేపుతోంది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..