ఢిల్లీ కూరగాయల్లో విషపూరిత పదార్థాలు!
నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసిన ఓ పరిశోధన భయానక నిజాలు బయటపెట్టింది. ఢిల్లీలో అమ్ముతున్న కూరగాయల్లో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు తేల్చింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఢిల్లీ మార్కెట్కు తరలించే కూరగాయల్లో టాక్సిక్ మెటల్స్ ఉన్నాయనే విషయం వెలుగుచూడటంతో నగరవాసుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. యమునా నది పరీవాహక ప్రాంతాల్లో పండిస్తున్న కూరగాయల్లో భారీ స్థాయిలో ‘లెడ్’ పరిమాణం ఉందని నిర్దరించారు. వీటిని దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్, అవయవాలు దెబ్బతినడం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, మెదడు […]
నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసిన ఓ పరిశోధన భయానక నిజాలు బయటపెట్టింది. ఢిల్లీలో అమ్ముతున్న కూరగాయల్లో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు తేల్చింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఢిల్లీ మార్కెట్కు తరలించే కూరగాయల్లో టాక్సిక్ మెటల్స్ ఉన్నాయనే విషయం వెలుగుచూడటంతో నగరవాసుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. యమునా నది పరీవాహక ప్రాంతాల్లో పండిస్తున్న కూరగాయల్లో భారీ స్థాయిలో ‘లెడ్’ పరిమాణం ఉందని నిర్దరించారు. వీటిని దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్, అవయవాలు దెబ్బతినడం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తేల్చారు. చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు సైతం తలెత్తే ముప్పు ఉంది.
పంటపొలాలు, వ్యవసాయ క్షేత్రాల నుంచి తెచ్చిన ఈ కూరగాయలను ఢిల్లీలోని ప్రధాన మండీలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి వారాంతపు సంతలు, వీధుల్లోని చిన్న చిన్న దుకాణాలకు వీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో ఢిల్లీ వాసుల్లో ఎక్కవ శాతం జనాభా వీటినే వినియోగిస్తున్నారు. ఆయా మార్కెట్ల నుంచి సేకరించిన కూరగాయలను పరీక్షించి చూడగా.. కొత్తిమీర, పాలకూరల్లో సాధారణ స్థాయిని మించి లెడ్ ఉన్నట్లు గుర్తించారు. కూరగాయల్లో లెడ్ పరిమాణం ఒక కిలోకి 2.5మి.గ్రా ఉండాల్సి ఉండగా.. అక్కడ మాత్రం 2.8మి.గ్రా నుంచి గరిష్ఠంగా 13.8మి.గ్రా వరకు ఉందట. లెడ్ మినహా నికెల్, క్యాడ్మియం, మెర్క్యురీ మాత్రం సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. బ్యాటరీలు, పెయింట్, పాలిథీన్, ఆటోమొబైల్ విడిభాగాల తయారీ లాంటి పరిశ్రమల వల్లే నదుల్లో లెడ్ పరిమాణం పెరుగుతుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.