తొలిసారి ఇండియాలోనూ మిస్టీరియస్ ‘మోనోలిథ్’, అహ్మదాబాద్ లో ప్రత్యక్షం ! పబ్లిక్ పార్క్ లో వింత, అంతా ఆశ్చర్యం
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 నగరాల్లో కనిపించిన మిస్టీరియస్ మోనోలిథ్ (పొడవాటి ఫలకం) మొట్టమొదటిసారిగా ఇండియాలో కనిపించింది.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 నగరాల్లో కనిపించిన మిస్టీరియస్ మోనోలిథ్ (పొడవాటి ఫలకం) మొట్టమొదటిసారిగా ఇండియాలో కనిపించింది. గుజరాత్ అహమదాబాద్ లోని ఓ పబ్లిక్ పార్కులో ఇది ‘ప్రత్యక్షమైంది’.. లోహంతో తయారైన ఇది సుమారు 6 అడుగుల పొడవు ఉంది. అయితే దీని కింద తవ్విన గుర్తులు ఏవీ లేకపోవడం ఆశ్ఛర్యంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియడంలేదని ఈ పార్క్ బాగోగులు చూస్తున్న ఆశారామ్ అన్నారు. పార్కులో ఎవరూ దీన్ని పెడుతున్నట్టు చూడలేదన్నాడు. నిన్న సాయంత్రం ఇంటికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏమీ లేదని, కానీ ఈ ఉదయం తాను వచ్చి చూసేసరికి కనిపించిందని ఆయన చెప్పాడు. త్రిభుజాకారంలో ఉన్న ఈ మోనోలిథ్ పై కొన్ని నెంబర్లు, గుర్తులు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. దీని వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు.
ఈ విధమైన స్థూపం వంటిది మొట్టమొదట అమెరికా..ఉటా ఎడారిలో కనిపించింది. ఆ తరువాత రుమేనియా, ఫ్రాన్స్, పోలండ్ . బ్రిటన్, కొలంబియాలలో కూడా కనిపించింది. కాగా- అహమదాబాద్ లోని ఈ పార్క్ నిర్వహణను చూస్తున్న కార్పొరేషన్ అధికారులు ఈ మోనోలిథ్ విశేషాలను, వివరాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.