మాయాబజారేమిటి..? సాలూరి చాలానే వదులుకున్నారు..!
మాయాబజార్ సినిమాలో నాలుగు పాటలను సాలూరు రాజేశ్వరరావు మాస్టారు స్వరపరిచారన్న విషయం పాతదే కానీ, నీవేనా నను తలచినది పాట స్థానంలో పింగళి నాగేంద్రరావు మరో చక్కటి సాహిత్యం అందించాలనుకున్నారనీ, కుశలమా అంటూ పల్లవిని కూడా రాశారనీ ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు ఓ కొత్త విషయాన్ని చెప్పారు.
మాయాబజార్ సినిమాలో నాలుగు పాటలను సాలూరు రాజేశ్వరరావు మాస్టారు స్వరపరిచారన్న విషయం పాతదే కానీ, నీవేనా నను తలచినది పాట స్థానంలో పింగళి నాగేంద్రరావు మరో చక్కటి సాహిత్యం అందించాలనుకున్నారనీ, కుశలమా అంటూ పల్లవిని కూడా రాశారనీ ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు ఓ కొత్త విషయాన్ని చెప్పారు. రాజేశ్వరరావు మాస్టారు బాణి కూడా కట్టారట! ఆ ట్యూన్ను కూడా సింగీతం వినిపించి టైమ్ మిషన్లో ఓ 60 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారు. సరే…సాలూరి వారు ఎందుకని ఆ చిత్రం నుంచి తప్పుకుని ఉంటారు ? అన్నది మాత్రం జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది.. ఆ విషయాన్ని సింగీతం చెబితే బాగుటుంది. ఇక్కడ రాజేశ్వరరావు వ్యక్తిత్వం గురించి నాలుగు విషయాలు తెలుసుకుంటే ఆయనెందుకు మాయాబజార్ నుంచి తప్పుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
రాజేశ్వరరావుది విశిష్ట వ్యక్తిత్వం…అవిద్య, అహంకారం, అజ్ఞానం కళను శాసిస్తే తట్టుకోలేకపోయేవారు. స్వరకల్పనలో నిర్మాతల జోక్యాన్ని సహించేవారు కాదు. తేడా వస్తే భుజం మీద కండువా దులుపుకుని పోయేవారు. అందుకే తెలుగు ప్రజలు సాలూరిని కేవలం సంగీతదర్శకుడిగా చూడలేదు. ఆరాధనతో, అనురాగంతో చూశారు. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడేవారిని సహించేవారు కాదు సాలూరి వారు. అలాంటి వాళ్లను ఎక్కడుంచాలో అక్కడుంచేవారు. డబ్బు పెడుతున్నాం కదా!! కాబట్టి తాము చెప్పింది అమలు చేయాలనే నిర్మాతలకు ఘాటుగానే రిటార్టులిచ్చేవారు. అయ్యా…! మీరు లక్ష్మీ పుత్రులు.. కాదనేవారెవ్వరూ లేరు. కానీ మేము సరస్వతి సమార్చకులం.. దయచేసి మా పనిలో అడ్డురాకండి అంటూ సున్నితంగా చెప్పేవారు. సాలూరి మాటల్లోని ఘాటును చూసి నిర్మాతలు నోళ్లు కుట్టేసుకునేవారు. కొన్ని సందర్భాల్లో నిర్మాతలతో ఘర్షణలకు కూడా దిగేవారు. అవసరమైతే సినిమాను వదులుకునే వారే కానీ.. రాజీ పడేవారు కాదు.. పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఒకానొక సందర్భంలో జెమినీ వాసన్తోనే గొడవ పెట్టుకున్నారు. చంద్రలేఖ సినిమాలో డ్రమ్ డాన్స్ కంపోజింగ్ హడావుడిలో రాజేశ్వరరావున్నారు. అద్భుతమైన సంగీతాన్ని అందించాలన్నది ఆయన ఆలోచన. ఆ సమయంలో జెమినీ వాసన్ ఓ యాభై వెస్ర్టన్ పాటల రికార్డుల కట్టను సాలూరికిచ్చారు. వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచి బాణి కడతాడనేది వాసన్ ఉద్దేశం. కానీ అవతలున్నది రాజేశ్వరరావు. ఆత్మగౌరవం నిండుగా మెండుగా వున్న వ్యక్తి. ఏమిటివి అని ప్రశ్నించారు. వాసన్ పక్కనున్న వాళ్లు మెల్లిగా నసుగుతూ అసలు విషయం చెప్పారు. అంతే… ఆ రికార్డుల కట్టను అమాంతం నేలమీదకు విసిరికొట్టి బద్దలు కొట్టారు. ఇంతకంటే బెస్ట్ ట్యూన్లను నేనిస్తాను. వీటితో నాకు అవసరం లేదు.. మీరు విశ్రాంతి తీసుకోవచ్చు.. అంటూ విసవిసా వెళ్లిపోయారు. నివ్వెరపోవడం వాసన్ వంతైంది. రాజేశ్వరరావు కాబట్టి సరిపోయింది. మరొకరు అయితేనా…పెద్ద గొడవే అయ్యేది.
ఓ కంపెనీలో పాటల కంపోజింగ్ జరుగుతుంది. దర్శకుడు, నిర్మాత ఆయన వందిమాగధులు, పరివారం…మొత్తమంతా కుర్చిలలో కూర్చొని..సాలూరిని చాప మీద కూర్చొపెట్టి కంపోజింగ్ చేయమన్నారు. బాణీలేమో ఎంతకీ కుదరడం లేదు. తలా ఒక ప్రశ్న వేస్తూ.. తలా ఒక సూచన చేస్తూ కంపోజింగ్ చేయమన్నారు. రాజేశ్వరరావుకి కోపం వచ్చింది. అయ్యా… ఇదేదో సుప్రీం కోర్టులో ముద్దాయిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నట్టుగా వుంది కానీ… కంపోజింగ్గా లేదు..ఇంత మంది జడ్జీలను తృప్తి పర్చడం నా వల్లకాని పని.. నాకు సెలవు ఇప్పించండి.. అంటూ వెళ్లిపోయారు. మహా గాయకుడైనా పొరపాట్లు చేస్తే సుతిమెత్తగా హెచ్చరించేవారు. ఇలాగే ఓ గాయకుడు పాడుతున్నప్పుడు … చాలా బాగుంది మాస్టారు.. ఇక టేక్ చేసేయ్యడమే.. మీరు శ్రుతిలో పాడితే అని సున్నితంగా అనేవారు.
బహుశా విజయా సంస్థతో కూడా ఇలాంటి గొడవే జరిగి ఉంటుంది.. ఎక్కడో కుదరలేదు.. మాయాబజార్లో ఓ నాలుగు అద్బుతమైన పాటలను స్వరపరచి వైదొలిగారు. తర్వాత ఘంటసాల ఆర్కస్ర్టయిజేషన్ చేసి రికార్డింగ్ జరిపించారు. ఆ తర్వాత అప్పుచేసి పప్పుకూడు సినిమా చేసినా విజయాతో సంబంధం కొనసాగలేదు. అలాగే ఎన్టీయార్ తీసిన సీతారామకల్యాణం, దానవీర శూర కర్ణలు కూడా. కారణాలేంటో తెలియదు కానీ.. ఓ రెండుమూడు పాటల తర్వాత వాటిని వదిలేసుకున్నారు.