సంగీత దర్శకుడు రాజన్ స్వరం ఆగిపోయింది
ప్రముఖ సంగీత దర్శకులు రాజన్ కన్నుమూశారు.. తన సోదరుడు నాగేంద్రతో కలిసి అజరామరమైన సంగీతాన్ని అందించారు రాజన్.. 87 ఏళ్ల రాజన్ బెంగళూరులోని తన నివాసంలో ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు..
ప్రముఖ సంగీత దర్శకులు రాజన్ కన్నుమూశారు.. తన సోదరుడు నాగేంద్రతో కలిసి అజరామరమైన సంగీతాన్ని అందించారు రాజన్.. 87 ఏళ్ల రాజన్ బెంగళూరులోని తన నివాసంలో ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు.. గత కొన్ని రోజులుగా ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. మైసూరులో జరన్మించిన రాజన్ తన సోదరుడు నాగేంద్రతో కలిసి ఎన్నో మధురమైన స్వరాలను అందించారు.. కన్నడలోనే కాదు.. తెలుగులోనూ ఆ సోదర ద్వయం ఎన్నో జనరంజకమైన పాటలను స్వరపరిచారు. 1952లో వచ్చిన సౌభాగ్యలక్ష్మి చిత్రంతో వీరి సినీ ప్రస్థానం ప్రారంభమయ్యింది. నాగేంద్ర పదేళ్ల కిందటే చనిపోయారు. 1957లో విడుదలైన వద్దంటే పెళ్లి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు రాజన్ నాగేంద్ర. మొదట్లో విఠాలాచార్య సినిమాలకే చేసినప్పటికీ 1976లో వచ్చిన పూజ సినిమా ఈ జోడికి మంచి బ్రేక్ ఇచ్చింది.. కన్నడ కంఠీరవ రాజ్కుమార్తో తెలుగులో పాట పాడించిన ఘనత వీరిదే! వీరి చివరి చిత్రం 1994లో వచ్చిన అఆఇఈ సినిమా. నవగ్రహపూజా మహిమ, అగ్గిపిడుగు, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, సొమ్మొకడిది సోకొకడిది, అల్లరి బావ, నాగమల్లి, అద్దాల మేడ, నాలుగుస్తంభాలాట, వయ్యారిభామలు-వగలమారిభర్తలు, మంచుపల్లకి, మూడు ముళ్లు, రెండు రెళ్లు ఆరు, ప్రేమఖైది, అప్పుల అప్పారావు సినిమాల్లోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి.