శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. చేతబడి నెపంతో ఒకరి సజీవదహనం
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. మంత్రాల నెపంతో ఓ యువకుడిని సజీవదహనం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. మంత్రాల నెపంతో ఓ యువకుడిని సజీవదహనం చేశారు. కొత్తూరు మండలం పుల్లగూడ గిరిజన గ్రామంలో శనివారం అర్థరాత్రి ఈ అమానుష ఘటన జరిగింది. పుల్లగూడకు చెందిన ఊలక రమేష్ అనే వ్యక్తి పది రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే అదే గ్రామానికి చెందిన ఊలక నాయకమ్మ (44) చేతబడి చేయడం వల్లే అతడు చనిపోయినట్లు అనుమానించిన రమేష్ బంధువులు స్థానికులతో కలిసి నాయకమ్మను తీవ్రంగా కొట్టారు. తర్వాత ఒడిశాలోని ఓ భూతవైద్యుడిని సంప్రదించి నాయకమ్మ చేతబడి చేశాడని నిర్ధారణకు వచ్చారు.
గ్రామానికి తిరిగి చేరుకున్నాక నాయకమ్మను హతమార్చాల్సినందిగా అతని కుటుంబసభ్యులపై ఒత్తిడి తెచ్చారు. వారు తిరస్కరించడంతో శనివారం అర్ధరాత్రి నాయకమ్మను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి నోటిలో గుడ్డలు కుక్కి, కాళ్లకు వైరు కట్టి, శ్మశానానికి తీసుకెళ్లి కొట్టి చంపారు. అనంతరం ఆనవాలు దొరక్కూడదని వెంటనే మృతదేహాన్ని దహనం చేశారు. విషయం తెలుసుకున్న పాలకొండ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు శివకృష్ణ, గంధర్వులు, దుర్గారావు, కరువయ్య, మో హనరావు, కామకృష్ణ, చిన్నారావు, ముఖ లింగంలతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.