కరోనా వారియర్లకు బంగారు నాణేలు ఇచ్చిన ఎంపీ
అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందు వరుసలో ఉండి కరోనా వారియర్స్ చేస్తోన్న సేవలు వెల కట్టలేనివి.
అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందు వరుసలో ఉండి కరోనా వారియర్స్ చేస్తోన్న సేవలు వెల కట్టలేనివి. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరు సేవలను అందిస్తున్నారు. అయితే వారి సేవలకు రుణం తీర్చుకోలేనప్పటికీ.. వారి పట్ల తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఓ ఎంపీ. 30 మంది కరోనా వారియర్లకు ఒక్కొక్కరికి రూ.5వేల డబ్బుతో పాటు బంగారు నాణేలను(ఒక గ్రాము తూగే) బహుమానంగా ఇచ్చారు ముంబయి బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి. ఎంపీ నుంచి బంగారు నాణేలు అందుకున్న వారిలో సెక్యూరిటీ గార్డ్స్, పారిశుద్ధ్య కార్మికులు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉన్నారు.
దీనిపై గోపాల్ శెట్టి మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మనమందరం మనకు చేతనైన సాయం చేసేందుకు ముందుకు రావాలి అని అన్నారు. ఇక ముంబయిలోని ప్రైవేట్ హౌజింగ్ సొసైటీల్లో కరోనా కేర్ సెంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ముంబయి అడ్మినిస్ట్రేషన్ను కోరారు. ఇందులో భాగంగా కొన్ని ప్రైవేట్ కేర్ సెంటర్లు ఏర్పాటు కావడం చాలా సంతోషమని తెలిపారు. కాగా కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు గోపాల్ శెట్టి. కరోనాకు చికిత్స అందిస్తున్న పలు ఆసుపత్రులకు ఆయన బెడ్లను సరఫరా చేశారు.