భూ వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే.. నిజం తేల్చాల్సింది కలెక్టరే!
పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీప్రాజును భూవివాదం వెంటాడుతోంది. తన నియోజకవర్గ పరిధిలో 8 ఎకరాల చెరువును ఎమ్మెల్యే కబ్జా చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. చెరువు గర్భాన్ని తవ్వేస్తూ జేసీబీతో చదును చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మండిపడుతున్నారు. అయితే ఆ భూమి ప్రభుత్వానిదని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని ఎమ్మెల్యే సవాల్ విసురుతున్నారు. పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీప్రాజు ఇప్పుడు భూవివాదంలో ఇరుక్కున్నారు. రాంపురం మండలంలోని సర్వే నెంబర్ ఒకటిలో ఉన్న […]
పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీప్రాజును భూవివాదం వెంటాడుతోంది. తన నియోజకవర్గ పరిధిలో 8 ఎకరాల చెరువును ఎమ్మెల్యే కబ్జా చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. చెరువు గర్భాన్ని తవ్వేస్తూ జేసీబీతో చదును చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మండిపడుతున్నారు. అయితే ఆ భూమి ప్రభుత్వానిదని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని ఎమ్మెల్యే సవాల్ విసురుతున్నారు.
పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీప్రాజు ఇప్పుడు భూవివాదంలో ఇరుక్కున్నారు. రాంపురం మండలంలోని సర్వే నెంబర్ ఒకటిలో ఉన్న వీర్రాజు చెరువులోని దాదాపు ఎనిమిది ఎకరాల 68 సెంట్ల స్థలాన్ని ఎమ్మెల్యే కబ్జా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాంపురంలోని స్థలాన్ని చదును చేస్తుండగా, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు, ఘటనా స్థలానికి చేరుకుని అడ్డుకోవటంతో వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. గ్రామ సర్వే రికార్డుల్లో అది వీర్రాజు చెరువుగా స్పష్టంగా ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే చెరువును ఆక్రమిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లోనూ దీనిపై ఫిర్యాదు చేశామని బండారు చెబుతున్నారు.
తనపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే అదీప్రాజు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇనాం భూముల కింద కావలి వీర్రాజు అనే వ్యక్తి 1907లో టీడీ నెంబర్ 2568 కింద ప్రభుత్వం నుంచి పట్టా పొందారని, తర్వాత దాన్ని నాయుడు బాబు అనే వ్యక్తి కొన్నారని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఆ నాయుడు బాబు నుంచి తాము 1988లో కొనుగోలు చేశామని అదీప్రాజు అంటున్నారు. ఆ తర్వాత వీర్రాజు వారసులమంటూ కొందరు రైత్వారీ పట్టాతో తమను సంప్రదించారని, ఆ వివాదాన్ని 2014లో లోక్ అదాలత్లో పరిష్కరించుకున్నామని ఎమ్మెల్యే చెబుతున్నారు. 2016లోనూ, 2019లోనూ టీడీపీ కోర్టుకి వెళ్లిందని, అప్పటి తాహసీల్దార్లు తమకు క్లీన్ చిట్ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అక్కడ ఎటువంటి వాటర్ బాడీస్ లేవని, అది వ్యవసాయ భూమి అనీ, తాహసీల్దార్లు పేర్కొన్నారని ఎమ్మెల్యే చెప్పారు. తనను రాజకీయంగా అణగదొక్కేందుకు టీడీపీ కుట్రచేస్తుందంటున్నారు.
ఎమ్మెల్యే చెరువు కబ్జాపై అటు జిల్లా కలెక్టర్ వినయ్చంద్ స్పందించారు. ఈ వివాదానికి సంబంధించిన సమాచారాన్ని స్థానిక అధికారుల నుంచి తెప్పించుకుని పరిశీలిస్తామన్నారు. అయితే ఎమ్మెల్యే భూకబ్జా విషయంలో తాము వెనక్కితగ్గేది లేదంటున్నారు మాజీ ఎమ్మెల్యే బండారు. శుక్రవారం మీడియాతో పాటు ఘటనాస్థలానికి వెళ్లి కబ్జాకు గురైన చెరువును ఆధారాలతో సహా చూపించడానికి టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.