ఇవే మా ప్రచారాస్త్రాలు… ప్రభుత్వరంగ సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని మంత్రి హరీశ్ రావు విమర్శ
తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారాస్ర్తాలని రాష్ర్ట ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ మాత్రం ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
Minister Harish Rao : తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారాస్ర్తాలని రాష్ర్ట ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ మాత్రం ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పఠాన్చెరులో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు.
ఎడాదికి కోటి చొప్పున ఉద్యోగాలిస్తామని చెప్పిన బీజేపీ ఈ ఆరున్నరేళ్లలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణతో ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తోందని ఎద్దేవ చేశారు. దీంతో లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోతున్నారని…. బీఎస్ఎన్ఎల్, రైల్వేలు, ఎయిర్ ఇండియా, బీపీసీఎల్, ఓఎన్జీసీ వంటి సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.
అదే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం బీహెచ్ఈఎల్కు రూ. 30 వేలకోట్ల విలువ గల యాదాద్రి పవర్ ప్రాజెక్టు పనులు అప్పగించినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి ఆసియాలోనే అతి పెద్ద 148 మెగావాట్ల పంపు పనులు అప్పగించిందన్నారు. కేంద్రం కాని, దేశంలో ఏ రాష్ట్రం కూడా బీహెచ్ఈఎల్కు పనులు అప్పగించలేదన్నారు.