ఏపీ సర్కార్ శుభవార్త: వచ్చే ఐదేళ్లలో ఇలా..
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కార్ కృషిచేస్తోందన్నారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరణ ఇచ్చారు..ఈ క్రమంలోనే టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కార్ కృషిచేస్తోందన్నారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో 30 లక్షల ప్రభుత్వ గృహాలు నిర్మించాలన్నదే వైసీపీ సర్కార్ లక్ష్యమని తెలిపారు. పేద ప్రజలకు 30 లక్షల ఇళ్ల ప్లాట్లు ఇస్తుంటే ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి మింగుడు పడటం లేదని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఐదేళ్ల కాలంలో కనీసం 7 లక్షల ఇళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే తప్ప.. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు విడతల గ్రామ సభలు పెట్టి ప్రజల నుంచి వినతులు స్వీకరించామని చెప్పారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మే నెల వరకు ప్రజల నుంచి 30 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. గృహ నిర్మాణ రంగంలో రూ. 4 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు రూ.40 లక్షలు చెల్లిస్తామని చెప్పినా భూమి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. అధిక ధరకు ప్రభుత్వం భూములను సేకరించినట్లు ఆరోపిస్తున్నారని.. అయితే రాజమహేంద్రవరం వద్ద ఎకరం రూ.7 లక్షలకు చంద్రబాబు ఇప్పిస్తారా? అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం చుట్టూ కాలనీలు నిర్మించాలన్నదే జగన్ సర్కార్ ఆలోచన అని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.