ఆర్జేడీ నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు.. బీహార్లో మధ్యంతరం ఎన్నికలు ఖాయమంటూ కామెంట్
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా తయారైందని ఆర్జేడీ నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్ ఆరోపణలు చేశారు.
బీహార్ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా తయారైందని ఆరోపణలు చేశారు. ప్రభుత్వం అస్థిరమయ్యిందని, త్వరలోనే మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆర్జేడీ నేతలంతా మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని తేజస్వీయాదవ్ పిలుపునిచ్చారు. పాట్నాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు తేజస్వీ యాదవ్.
కాగా, మహాఘఠబంధన్లో జేడీయూతో కలసివెళతారన్న వార్తలను ఆయన ఖండించారు. కరోనా వ్యాక్సిన్ గురించి తేజస్వీ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ను శాస్త్రవేత్తలు కాకుండా, బీజేపీవారే తయారు చేసినట్టుందని విమర్శించారు. వైరస్ కారణంగా లక్షలాది మంది ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ ప్రభుత్వం బీజేపీ అధిష్టానంపై ఆధారపడి పాలన సాగిస్తుందన్న తేజస్వీ.. ఆ పార్టీకి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందని ఎద్దేవా చేశారు. బీహార్ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదన్న తేజస్వీ యాదవ్.. మధ్యంతర ఎన్నికలకు అంతా సిద్ధం కావాలన్నారు. తాము మహాఘఠబందన్లోకి రమ్మని ఎవరినీ ఆహ్వానించలేదని, అలాగే నితీష్తో పాటు కలసివెళ్లే ప్రశ్నేలేదని ఆయన స్పష్టం చేశారు.