ఈ ఏడాది డిజిటల్ స్వాతంత్య్ర వేడుకలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధిక సంఖ్యలో జనం ఒకచోట గుమిగూడటం శ్రేయస్కరం కాదు కాబట్టి చాలామంది ఈ ఏడాది వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఈ సంబరాలను దేశవ్యాప్తంగా...
MHA Issues Guidelines For Independence Day Celebrations : కొవిడ్ రక్కసి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ దఫా స్వాతంత్య్ర వేడుకలకు డిజిటల్ హంగులు అద్దాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎర్రకోట వద్ద ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడంతోపాటు అక్కడ నిర్వహించే కవాతు, గౌరవ వందనం వంటి కార్యక్రమాలను వెబ్ క్యాస్టింగ్ విధానంలో ప్రసారం చేయాలని నిర్ణయించింది.
అయితే ప్రతి ఏటా ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర సంబరాలను వేల మంది ప్రత్యక్షంగా వీక్షిస్తుంటారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధిక సంఖ్యలో జనం ఒకచోట గుమిగూడటం శ్రేయస్కరం కాదు కాబట్టి చాలామంది ఈ ఏడాది వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఈ సంబరాలను దేశవ్యాప్తంగా ఎక్కువమంది చూసేందుకు వీలుగా ఆన్లైన్లో, సోషల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
వేడుకల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. స్వాతంత్య్రోద్యమానికి సంబంధించి చారిత్రక ప్రాధాన్యమున్న ప్రదేశాల్లో పోలీసులు, మిలటరీ బ్యాండ్లతో ప్రదర్శనలు నిర్వహించి రికార్డు చేయాలని, అనంతరం వాటిని డిజిటల్, సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేయాలని లేఖలో కేంద్ర హోం శాఖ సూచించింది.