Maruti Suzuki: మారుతి కంపెనీ షాకింగ్ నిర్ణయం.. కార్ల ధరలు అమాంతం పెంపు..
Maruti Suzuki: భారత్లో అత్యంత గుర్తింపు పొందిన మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీకి చెందిన కార్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.
Maruti Suzuki: భారత్లో అత్యంత గుర్తింపు పొందిన మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీకి చెందిన కార్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై దాదాపు రూ.34,000 వరకు పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు సోమవారం నుంచే అమల్లో ఉంటాయని ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే అన్ని వేరియంట్లపై కాదని, ఎంపిక చేసిన మోడళ్లపై మాత్రమే ధరలు పెంచినట్లు మారుతి సుజుకీ సంస్థ తెలిపింది. ధరలు పెరిగిన కార్లలో మారుతి సుజుకి టూర్ ఎస్, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, మారుతి సుజుకి డిజైర్, మారుతి సుజుకి ఆల్టో 800, మారుతి సుజుకి సెలెరియో, మరికొన్ని మోడళ్లు ఉన్నాయి. కాగా, కరోనా నేపథ్యంలో డిసెంబర్ నెలలో 20 శాతం మేర కార్ల అమ్మకాలు పెరిగినట్లు మారుతి సుజుకి సంస్థ వెల్లడించింది.
ఇదిలాఉంటే, దేశంలో ఒక్క మారుతి సుజుకీనే కాదు.. ఇతర వాహన సంస్థలు కూడా తమ వాహనాల ధరలను పెంచేస్తున్నాయి. అంతకు ముందు ప్రముఖ టూవీలర్ కంపెనీలు సైతం తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ధరలు పెరిగిన వాటిలో రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్, టీవీఎస్ సంస్థలు తమ కంపెనీలకు చెందిన బైక్ల ధరలను సుమారుగా రూ.2000 లకు పెంచాయి. ఉత్పత్తి వ్యయం పెరగడమే కారణమని సదరు సంస్థలు కూడా చెబుతున్నాయి.