శుభలేఖలతో వెళితే శుభవార్తలు.. గులాబీ పార్టీలో కొత్త ట్రెండ్
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటింది. ఇప్పటికే కొంతమంది పదవుల కోసం వెయిటింగ్లో ఉన్నారు. మరికొంత మంది రెన్యూవల్ కోసం ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇందులో కొంతమందికి లక్కీ లాటరీ తగిలినట్లు వాళ్లు అడగకుండానే పదవులు రెన్యూవల్ అయినట్లు చర్చ నడుస్తోంది. ఇంతకీ వారికి దక్కిన అదృష్టమేంటి? ఎలా సాధ్యమైంది ఆ లక్ ? గులాబీ పార్టీలో ఇప్పుడు శుభలేఖల పర్వం నడుస్తోంది. శుభలేఖలతో అధినేత దగ్గరకు వెళ్ళి శుభవార్తతో తిరిగి రావడం […]
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటింది. ఇప్పటికే కొంతమంది పదవుల కోసం వెయిటింగ్లో ఉన్నారు. మరికొంత మంది రెన్యూవల్ కోసం ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇందులో కొంతమందికి లక్కీ లాటరీ తగిలినట్లు వాళ్లు అడగకుండానే పదవులు రెన్యూవల్ అయినట్లు చర్చ నడుస్తోంది. ఇంతకీ వారికి దక్కిన అదృష్టమేంటి? ఎలా సాధ్యమైంది ఆ లక్ ?
గులాబీ పార్టీలో ఇప్పుడు శుభలేఖల పర్వం నడుస్తోంది. శుభలేఖలతో అధినేత దగ్గరకు వెళ్ళి శుభవార్తతో తిరిగి రావడం హాట్ టాపిక్ మారింది. నేతల తలరాతలను ఈ శుభలేఖలు మారుస్తుతున్నాయని గులాబీ పార్టీలో తెగ చర్చ నడుస్తోంది.
తొలుత అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి.. ఆ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఇలా వివాహ ఆహ్వాన పత్రికలతో అధినేత కెసీఆర్ను కలిసి లక్కు దక్కించుకున్నారని చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత పిడమర్తి రవి కూడా ఇటీవల ప్రగతి భవన్కు వెళ్లారు. తన పెళ్లికి రావాలని సీఎంను ఆహ్వానించారు. ఇప్పుడు ఆయనకు కూడా గుడ్ న్యూస్ అందబోతుందా? అని టీఆర్ఎస్ నేతలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి శాప్ ఛైర్మన్గా ఉన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు పదవి రెన్యూవల్ కాలేదు. అయితే తన కొడుకు పెళ్లి కోసం కేసీఆర్ను ఆహ్వానించేందుకు ఇటీవల ప్రగతి భవన్ వెళ్లారాయన. సీఎం కేసీఆర్ను కలిసి శుభలేఖ ఇచ్చి పెళ్లికి రావాల్సిందిగా కోరారు. అయితే అక్కడే అద్భుతం జరిగింది. పెళ్లి కార్డ్ ఓపెన్ చేసి చూసిన కేసీఆర్.. శాప్ ఛైర్మెన్ హోదాలో నువ్వు ఆహ్వానించాలి ఇలా ఎందుకు అని అప్పటికప్పుడు వెంకటేశ్వర్ రెడ్డికి పదవి రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అధికారులు కూడా జీవో ఇచ్చేశారు. దీంతో వెంకటేశ్వరరెడ్డి ఆనందానికి అవధులు లేవు. పెళ్లికి పిలవడానికి వెళ్తే పదవి రెన్యూవల్ అయిందని ఆయన సన్నిహితుల దగ్గర ఆనందంగా చెప్పుకున్నారట.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా సేమ్ టు సేమ్ ఎక్స్పెరియన్స్. ఆయన తన కొడుకు ఎంగేజ్మెంట్కు సీఎం కేసీఆర్ను పిలిచేందుకు ప్రగతి భవన్ వెళ్లారు. అంతే హుజూర్నగర్ గెలుపు గిప్ట్ ఆయనకు దక్కింది. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఆయన నియమిస్తూ జీవో రిలీజైంది. ఈ పదవి కేబినెట్ హోదాతో కూడుకున్నది కావడంతో పల్లా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైనట్లు సమాచారం.
ఇప్పుడు ఇదే అనుభవం ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి ఎదురవుతుందన్న చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో. తన పెళ్లి పత్రిక ఇచ్చేందుకు కేసీఆర్ దగ్గరకు వెళ్లారు. ఆయన్ని తన పెళ్లికి ఆహ్వానించారు. దీంతో ఇప్పుడు ఈయన కూడా శుభవార్త అందుతుందని ఆయన అనుచరులు వెయిటింగ్లో ఉన్నారట. పిడమర్తి రవి కూడా పదవి రెన్యూవల్ కోసం చాలా రోజులుగా వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు పిడమర్తి విషయంలో కూడా శుభలేఖ వర్కవుట్ అయితే మిగతా వారు కూడా తమ కుటుంబంలో జరిగే శుభకార్యాల ఆహ్వాన పత్రికలు తీసుకోని పదవి రెన్యూవల్ చేయించుకుంటారని గులాబీ దళంలో గుసగుస నడుస్తోంది.