కరోనా రోగుల మరణాలు పెరగడానికి మరో కారణం.. ఏంటంటే?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా రోగుల మరణాల సంఖ్య పెరుగుతున్నదంటే అందుకు మరో కారణం కూడా ఉంది. అనేకమంది రోగులకు సకాలంలో నాణ్యమైన వెంటిలేటర్లు లభించక కూడా మృత్యు బాట పడుతున్నారని నిపుణులు తమ అధ్యయనంలో తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా రోగుల మరణాల సంఖ్య పెరుగుతున్నదంటే అందుకు మరో కారణం కూడా ఉంది. అనేకమంది రోగులకు సకాలంలో నాణ్యమైన వెంటిలేటర్లు లభించక కూడా మృత్యు బాట పడుతున్నారని నిపుణులు తమ అధ్యయనంలో తెలిపారు. చైనాలో విషమ స్థితిలో ఉన్న పేషంట్ల మరణాలకు దారి తీసిన పరిస్థితులపై జరిపిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. వూహాన్ లోని 21 ఆస్పత్రుల నుంచి అందిన డేటాను బట్టి దీన్ని నిర్ధారించారు. జనవరి 21-30 మధ్య మృతి చెందిన 168 మంది రోగుల విషయాన్నే తీసుకుంటే.. వీరిలో 46 మందికి కేవలం ముక్కు లేదా ఫేస్ మాస్క్ ఆక్సిజన్ ద్వారా చికిత్స అందించారట. అంటే సకాలంలో వెంటిలేటర్లు అమర్చి ఉంటే వీరు బతికేవారేమో ! రోగుల్లో మూడో వంతు మందికి ఎక్కువ మోతాదులో ముక్కు ద్వారా ఆక్సిజన్ అందించారు. 72 మందికి మొక్కుబడిగా వెంటిలేటర్లను అమర్చారు. ఈ విషయాలను అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించారు. ఒక విధంగా చెప్పాలంటే ఆలస్యంగా ఆక్సిజన్ చికిత్స లభించిన కారణంగానే రోగులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నారని స్పష్టమవుతోంది.