ఏపీలో షెల్టర్ జోన్‌గా బీజేపీ

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బీజేపీ ఓ షెల్టర్ జోన్‌గా మారుతోందా? పరిస్థితిని పరిశీలిస్తున్న వారంతా అవుననే అంటున్నారు. మొన్నటి ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు బీజేపీలో చేరడం, వారి చరిత్రలోని కీలకాంశాలు చూస్తే ఈ అభిప్రాయం కలగడం ఖాయం. ఏపీలో ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే సీటును 2019 మే నాటి ఎన్నికల్లో బీజేపీ గెలవలేకపోయింది. అయితేనేం.. ఇప్పుడు ఆ పార్టీకి ముగ్గురు రాజ్యసభ సభ్యులున్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగియగానే తెలుగుదేశం పార్టీకి బీజేపీ షాకిచ్చింది. […]

ఏపీలో షెల్టర్ జోన్‌గా బీజేపీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 06, 2020 | 2:37 PM

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బీజేపీ ఓ షెల్టర్ జోన్‌గా మారుతోందా? పరిస్థితిని పరిశీలిస్తున్న వారంతా అవుననే అంటున్నారు. మొన్నటి ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు బీజేపీలో చేరడం, వారి చరిత్రలోని కీలకాంశాలు చూస్తే ఈ అభిప్రాయం కలగడం ఖాయం. ఏపీలో ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే సీటును 2019 మే నాటి ఎన్నికల్లో బీజేపీ గెలవలేకపోయింది. అయితేనేం.. ఇప్పుడు ఆ పార్టీకి ముగ్గురు రాజ్యసభ సభ్యులున్నారు.

పార్లమెంటు ఎన్నికలు ముగియగానే తెలుగుదేశం పార్టీకి బీజేపీ షాకిచ్చింది. టీడీపీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎంపీలను బీజేపీ తమ వైపు లాక్కుంది. అయితే.. బీజేపీ వారిని ఆకర్షించిందా? లేక వారికి వ్యక్తిగతంగా వున్న అవసరాలు, కేసులు వారిని బీజేపీ వైపు నెట్టాయా? ఈ చర్చలో ఎక్కువ మంది రెండో పాయింట్‌కే మొగ్గుచూపుతున్నారు. అప్పట్లో బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుల్లో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఒకరు. పలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన కేసుల్లో సుజనా చౌదరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు తనవైపు రాకుండా వుండేందుకు సుజనా బీజేపీలో చేరారన్నది పలువురి అభిప్రాయం.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా అందరూ భావించే సీఎం రమేశ్ మరొకరు. ఆయన ఆస్తులపైనా, గత నాలుగైదు సంవత్సరాల ఆదాయంపైనా కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా వుందన్నది జగమెరిగిన సత్యం. అందువల్లనే ఆయన టీడీపీని, సన్నిహితుడైన చంద్రబాబును కాదని బీజేపీలో చేరారని చెప్పుకుంటారు పలువురు. టీజీ వెంకటేశ్‌తోపాటు.. తెలంగాణకు చెందిన గరికపాటి మోహన్ రావు కూడా బీజేపీలో చేరారు. వీరిద్దరికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలలో వున్న వ్యాపారాలే వారిద్దరు బీజేపీలో చేరడానికి కారణమైనట్లు పలువురు భావిస్తున్నారు.

అయితే తాజాగా.. పలువురు టీడీపీ నేతలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్న అంశం.. బీజేపీని షెల్టర్ జోన్ అనుకోవాల్సిన పరిస్థితిని సృష్టిస్తోంది. అనంతపురం పాలిటిక్స్‌లో ఒంటరిగా మారిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి.. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. తన ట్రావెల్స్‌పై గత మూడు నెలలుగా జరుగుతున్న దాడులు, తన పాత కేసులపై పోలీసుల కదలికలు.. చూసి విసిగిపోయిన జెసీ.. ఏపీ పోలీసులపై కొన్ని రోజుల క్రితం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ముందస్తు బయిల్‌తో పోలీస్ స్టేషన్‌కు వెళ్ళిన జెసీకి పోలీసులు చుక్కలు చూపించారు. సుమారు 8 గంటల పాటు పేపర్ల పరిశీలన పేరుతో ఆయన్ని స్టేషన్‌లో కూర్చోబెట్టారు.

ఈ పరిణామాలన్నీ వైసీపీ ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో జరుగుతున్నాయని భావిస్తున్న జెసీ… బీజేపీలో చేరడం ద్వారా కొంత మేరకు ఊరట పొందచ్చని బావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆయన.. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డితో భేటీ అయ్యారని చెప్పుకుంటున్నారు. ఏ క్షణమైన జేపీ బీజేపీలో చేరతారు అన్న ప్రచారానికి ఆయన ఆదివారం చేసిన కామెంట్లు ఊతమిస్తున్నాయి. పీఓకేని భారత్‌లో చేరిస్తే.. తాను బీజేపీలో చేరేందుకు రెడీ అంటూ వెరైటీగా మాట్లాడారు జేసీ. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడు బీజేపీ వైపు స్టెప్ వేస్తారన్న చర్చ ప్రస్తుతం జోరందుకుంది. మరోవైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ తదితరులు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పుకుంటున్నారు.