మణిపూర్ పోలీసు ఉన్నతాధికారి సంచలన నిర్ణయం.. గ్యాలంట్రీ అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చిన ఏసీపీ
మణిపూర్ పోలీసు ఉన్నతాధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తప్పుగా తీర్పు ఇచ్చిందంటూ తనకి ప్రభుత్వం ఇచ్చిన బహుమానాన్ని తిరిగి అప్పగించేశారు.
మణిపూర్ పోలీసు ఉన్నతాధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తప్పుగా తీర్పు ఇచ్చిందంటూ తనకి ప్రభుత్వం ఇచ్చిన బహుమానాన్ని తిరిగి అప్పగించేశారు. మణిపూర్ అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ తౌనాజమ్ బృందా తనకిచ్చిన గ్యాలంట్రీ అవార్డును ప్రభుత్వానికి తిరిగిచ్చేసింది. ఇంఫాల్లోని ప్రత్యేక కోర్టు ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించడంతో.. ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలావుంటే, మణిపూర్ రాష్ట్రంలో 2018 సంవత్సరంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ముఖ్యమంత్రి పోలీసు పతకాన్ని ప్రదానం చేశారు. సరిహద్దు రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అమ్మకాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన కృషికి గుర్తింపుగా దేశభక్తుల దినోత్సవం సందర్భంగా 2018 లో మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్.. పోలీసు అధికారి తౌనాజోమ్ బృందాకు గ్యాలంట్రీ అవార్డును బహూకరించారు. అనంతరం ఆమెకు అదనపు సూపరింటెండెంట్ పదవికి పదోన్నతి కల్పించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో బీజేపీ మాజీ నేత చందేల్ ఏడీసీ చైర్మన్ లుఖోసే జూ సహా మరో ఆరుగురు నిందితులుగా ఉన్నారు. అయితే రెండేళ్లపాటు విచారణ జరిపిన ఇంఫాల్లోని స్పెషల్ కోర్ట్ ఏడుగురిని నిర్ధోషులు ప్రకటించింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన తౌనాజమ్ బృందా ఈ పతకాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్కు లేఖ రాసి.. గ్యాలంట్రీ అవార్డును వాపస్ ఇవ్వడానికి కోర్టు పరిశీలనే కారణమని, డ్రగ్స్ దర్యాప్తు ఎంతమాత్రమూ సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు. నా విధిని సక్రమంగా నిర్వహించలేదని నైతికతో అవార్డును వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను. అందువల్ల, మీ ద్వారా నాకు లభించిన గౌరవానికి నేను అర్హురాలిని కాదని భావిస్తున్నాను. మరింత అర్హతగల, నమ్మకమైన పోలీసు అధికారికి ఇవ్వడానికి వీలుగా రాష్ట్ర హోం శాఖకు గ్యాలంట్రీ అవార్డును తిరిగి ఇస్తున్నాను” అని ఆమె ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.