కోరుట్లలో దారుణం.. ఓ వ్యక్తిని ఫిల్లర్కు కట్టేసి గొంతు కోసి హత్య
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని గ్రామపంచాయితీ కార్యాలయ ఫిల్లర్కు కట్టేసి అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చారు.
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని గ్రామపంచాయితీ కార్యాలయ ఫిల్లర్కు కట్టేసి అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చారు. ఈ ఘటన కోరుట్ల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో జరిగింది.ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట చిన్నలక్ష్మయ్య (48) అనే వ్యక్తి శనివారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. గ్రామ పంచాయతీ భవనం ఫిల్లర్కు కట్టేసిన దుండగులు గొంతుకోసి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. భార్యాభర్తల నడుమ గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే క్రమంలో గత అర్ధరాత్రి భార్యాభర్తలకు మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరగడంతో లక్ష్మయ్య తన అత్తపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. కాగా, తెల్లవారేసరికి లక్ష్మయ్య దారుణహత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు జగిత్యాల జిల్లా అదనపు ఎస్సీ సురేశ్ కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.