నిర్మలా సీతారామన్ ప్రకటించిన రెండో రోజు ప్యాకేజీలో కీలక అంశాలు..
కేంద్రప్రభుత్వం మరో ప్యాకేజీ ప్రకటించింది. వలస కూలీలు, చిన్న వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి, సన్నకారు రైతులకు ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం..
కేంద్రం ప్రకటించిన రెండో ప్యాకేజీః
కేంద్రప్రభుత్వం మరో ప్యాకేజీ ప్రకటించింది. వలస కూలీలు, చిన్న వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి, సన్నకారు రైతులకు ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం.. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకూ వడ్డీ రాయితీ పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఇక వ్యవసాయానికి సాయం ఇంతటితో ఆగదని పేర్కొంది. ఇదే సమయంలో ముద్ర యోజన, హౌసింగ్, ఉద్యోగాల కల్పన అంశాలపై ప్యాకేజీ ఉంటుందన్నారు.
రైతులకు తక్కవ వడ్డీకే రుణాలుః
రెండో రోజు ప్యాకేజీలో 9 విభాగాలకు కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్..సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. రైతులకు 25 లక్షల కిసాన్ కార్డులు అందించామని,..దీని ద్వారా రైతులకు రూ. 25వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు ప్రకటించారు. ఇక గిరిజనులకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని..ప్రజలకు నేరుగా డబ్బు చేరేలా ప్రత్యేక చర్యలను చేపట్టామన్నారు.
నిరాశ్రయులైన పేదలకు మూడు పూటలా ఆహారంః
లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి వలస కార్మికుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్..మార్చి 28 నుంచి పలు నగరాల్లో నిరాశ్రయులైన వారికి మూడు పూటలా ఆహారం అందించామన్నారు. ఇందుకోసం రాష్ట్రాలకు ఏప్రిల్ 3న రూ. 11,003 కోట్లు చెల్లించామన్నారు. ఇక వలస కార్మికులకు నగదు కూడా పంపిణీ చేశామని.. రాష్ట్రాలకు ఇచ్చిన నిధులను వలస కార్మికుల కోసం వినియోగించాలని ఆమె కోరారు.
కార్మికులకు 13 కోట్ల పనిదినాలుః
వలస కార్మికులకు ఉపాధి హామీ కింద రాష్ట్ర ప్రభుత్వాలు పని కల్పించాలన్న కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్..మే 13 నాటికి వలస కార్మికులకు 13 కోట్ల పనిదినాలు కల్పించామన్నారు. ఈ పథకం కింద కార్మికులకు రూ. 10 వేల కోట్లు ఇచ్చామన్నారు. దీంతో పాటు పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.12వేల కోట్లు ఇప్పటికే అందించామని.. ఈ సంఘాల ద్వారా 3 కోట్ల మాస్కులు, 1.2 లక్షల లీటర్ల శానిటైజర్లు తయారు చేయించినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
రెండు నెలలు రేషన్ ఉచితంః
రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయనున్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం, గోధుమలు, కిలో పప్పుధాన్యాలు పంపిణీ చేస్తామని..కార్డులేని పేదలు కూడా రేషన్ పొందవచ్చని స్పష్టం చేసింది. ఇక వలస కార్మికులు దేశంలో ఎక్కడున్నా.. కార్డు లేకున్నా రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు పొందవచ్చాన్నారు. దీని ద్వారా 8 కోట్ల మంది వలస కార్మికులకు లబ్ధి చేకూరుతుందని కేంద్రం ప్రకటించింది.