మహేష్ వర్సెస్ బన్నీ.. మళ్లీ మొదటికి.. అసలేం జరుగుతోంది..?
సంక్రాంతి ఫైట్ మళ్లీ మొదటికి వచ్చింది. మొన్నటివరకు కాస్త తగ్గినట్లే కనిపించిన టాలీవుడ్ టాప్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇప్పుడు మళ్లీ సై అంటే సై అంటున్నారు. అల వైకుంఠపురములోను రెండు రోజుల ముందే(జనవరి 10) విడుదల చేయాలని బన్నీ టీమ్ భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు గుప్పమన్నాయి. దీంతో మహేష్ టీమ్ కూడా తాము ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని అంటోందట. అల వైకుంఠపురములో వచ్చే రోజే తమ సినిమాను విడుదల చేయాలని […]
సంక్రాంతి ఫైట్ మళ్లీ మొదటికి వచ్చింది. మొన్నటివరకు కాస్త తగ్గినట్లే కనిపించిన టాలీవుడ్ టాప్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇప్పుడు మళ్లీ సై అంటే సై అంటున్నారు. అల వైకుంఠపురములోను రెండు రోజుల ముందే(జనవరి 10) విడుదల చేయాలని బన్నీ టీమ్ భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు గుప్పమన్నాయి. దీంతో మహేష్ టీమ్ కూడా తాము ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని అంటోందట. అల వైకుంఠపురములో వచ్చే రోజే తమ సినిమాను విడుదల చేయాలని వారు అనుకుంటున్నారట. దీనికి సంబంధించి టీమ్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. సరిలేరు నీకెవ్వరు చిత్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు కాగా.. ఆయన ప్రస్తుతం ఫారిన్లో ఉన్నారట. ఇవాళ ఇక్కడికి తిరిగి వస్తుండగా.. ఆయన రాగానే సరిలేరు నీకెవ్వరు రిలీజ్ డేట్పై ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎవ్వరూ వెనక్కి తగ్గకపోతే.. టఫ్ ఫైట్ మాత్రం తప్పనిసరి.
అయితే మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాను అనిల్ రావిపూడి ప్రకటించినప్పుడే ఈ మూవీకి విడుదల తేదిని ప్రకటించారు. 2020 సంక్రాంతికి తమ సినిమా రానుందని వారు అప్పట్లోనే తెలిపారు. మరోవైపు అల వైకుంఠపురములో విడుదల డేట్ను బన్నీ టీమ్ మొదట ప్రకటించలేదు. షూటింగ్ మధ్యలో తమ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ప్రకటించారు. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య వార్ మొదలైంది. ఇక ఆ తరువాత రెండు సినిమాలకు జనవరి 12నే రిలీజ్ డేట్ను ప్రకటించడంతో చాలా రోజుల పాటు ఇరు టీమ్ల మధ్య కోల్డ్ వార్ జరిగింది. విడుదల తేది విషయంలో వెనక్కి తగ్గమంటే తగ్గమని ఇద్దరు హీరోలు చెప్పడం.. అప్పట్లో ఇరు సినిమా నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఎలాగోలా వారిని బుజ్జగించి ఒక రోజు గ్యాప్తో విడుదల తేదీలను ప్రకటించారు నిర్మాతలు. ఈ క్రమంలో సరిలేరు నీకెవ్వరును జనవరి 11న, అల వైకుంఠపురములోనూ 12న విడుదల తేదీలను ఫిక్స్ చేశారు. ఇక దీంతో అంతా బావుందని అనుకునే సమయానికి మళ్లీ వివాదం మొదటికి వచ్చింది.
ప్రమోషన్లలో అల వైకుంఠపురములో దూసుకుపోతుండగా.. ఈ సినిమాపై అన్ని వర్గాల్లో అంచనాలను పెరిగాయి. ఈ క్రమంలో ఆ అంచనాలను క్యాష్ చేసుకోవాలనుకుంటోన్న అల టీమ్.. తమ సినిమాను రెండు రోజుల ముందే తీసుకురావాలని భావిస్తున్నారట. బన్నీకి ఇది ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ కావడం, ముందుగా విడుదల చేస్తే కలెక్షన్లు సాధించవచ్చనే ఆలోచనతో బన్నీ టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు మహేష్ టీమ్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గనంటోంది. సరిలేరు నీకెవ్వరుపై టీమ్ మొత్తానికి మంచి అంచనాలు ఉండటంతో.. తాము ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని వారు అంటున్నారట. ఈ క్రమంలో దిల్ రాజు ఇవాళ రాగానే.. ఈ రెండు సినిమా విడుదల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.