తెలంగాణలో కలిసేందుకు మహా ఆరాటం.. ఎందుకో తెలిస్తే షాక్..!!
కేసీఆర్, కేటీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఫొటోలతో బ్యానర్ ఏర్పాటు చేసిన మహారాష్ట్ర నాయకులు, మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని నయ్గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్గావ్ నియోజకవర్గాలకు చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిశారు. “తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మా గ్రామాల్లోనూ అమలు చేయాలి. అలా చేయలేకపోతే మా గ్రామాలను తెలంగాణలో కలపాలి” అనే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తాము […]
కేసీఆర్, కేటీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఫొటోలతో బ్యానర్ ఏర్పాటు చేసిన మహారాష్ట్ర నాయకులు, మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని నయ్గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్గావ్ నియోజకవర్గాలకు చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిశారు. “తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మా గ్రామాల్లోనూ అమలు చేయాలి. అలా చేయలేకపోతే మా గ్రామాలను తెలంగాణలో కలపాలి” అనే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు వారు చెప్పారు. ఆ విషయాన్ని సీఎం కేసీఆర్కు వివరించి, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని వారు కోరారు. తాము టీఆర్ఎస్ టికెట్పై మహారాష్ట్రలో పోటీ చేసేందుకు కూడా సిద్ధమని తెలిపారు. ‘మా గ్రామాలన్నీ తెలంగాణ గ్రామాలకు సరిహద్దులోనే ఉన్నాయి. కానీ, మా గ్రామాల పరిస్థితి, తెలంగాణ గ్రామాల పరిస్థితి చాలా భిన్నంగా ఉంది” అని వారు వివరించారు.
మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులోని ధర్మాబాద్ తాలూకా సహా… 5 నియోజకవర్గాలలోని పలు గ్రామాల ప్రజలు ఏమంటున్నారంటే… “ఇక్కడ మాకు ప్రతిదీ సమస్యే. రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మీరే చూస్తున్నారు కదా” అని నయ్గావ్ నియోజకవర్గానికి చెందిన గంగాధర్ అన్నారు. “మా ప్రాంతంలో గ్రామాలకు సరిగా రోడ్లు లేవు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు” అని డెగ్లూర్ నియోజకవర్గానికి చెందిన చిన్నా రెడ్డి తెలిపారు. “నీటి సమస్య ఉంది. నాలాలు శుభ్రం చేయరు. రోడ్లు బాగుండవు” అని బోకర్ ప్రాంతానికి చెందిన గణపతి రావు చెప్పారు. డెగ్లూర్ నియోజకవర్గానికి చెందిన రాజు మాత్రం తమకు సమస్యలేమీ లేవని అన్నారు. “గతంలో సమస్యలు ఉండేవి. కానీ, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంతో సమస్యలేమీ లేవు. అంతా బాగానే ఉంది. మా మహారాష్ట్ర కూడా అభివృద్ధి అవుతుంది” ఆయన వివరించారు.
“సరైన వైద్య సదుపాయాలు లేవు. కరెంటు, విద్య, ఇవన్నీ ఇక్కడ సమస్యలే” అని కిన్వట్కు చెందిన సూర్యవంశీ గజానంద్ చెప్పారు. “మహారాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న కోపం ఏంటంటే, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారు. కానీ, ఆ పథకాల ప్రయోజనాలు అందాల్సిన వారికి అందవు” అని బోకర్ నియోజకవర్గం వాసి స్వరూప అన్నారు.
ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అజెండాగా టీఆర్ఎస్ పార్టీ టికెట్పై ఎన్నికల బరిలోకి దిగేందుకు స్థానిక నాయకులు సిద్ధమవుతున్నారు. “సరిహద్దులో ఉండటంతో మమ్మల్ని పట్టించుకునేవారు లేరు. తెలంగాణను కేసీఆర్ అంత అభివృద్ధి చేసినప్పుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? కేంద్రంలోనూ వారి ప్రభుత్వమే ఉంది కదా” అని బాబ్లీ సర్పంచ్ బాబురావు గణపతిరావు కదమ్ ప్రశ్నించారు. “మా తాలూకా మాత్రమే కాదు, సరిహద్దులో ఉన్న అన్ని తాలూకాల్లోనూ నాయకుడిగా నిలబడి ప్రజలందరికీ సౌకర్యాలు అందేలా చూడాలని కేసీఆర్ నాకు సూచించారు. కేసీఆర్ చెప్పడంతోనే ఎన్నికల బరిలోకి దిగాము” అని బాబురావు గణపతిరావు చెప్పారు.
“ఇక్కడ టీఆర్ఎస్ పోటీ చేయడం వల్ల, నాకు తెలిసి పెద్దగా ఏం జరగదు. ఓట్లను చీల్చడం తప్పితే, ఆ పార్టీ గెలిచే అవకాశాలైతే లేవు. టీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో కాంగ్రెస్కు మద్దతుగా నిలిస్తే ఇంకా మంచిది” అని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ అన్నారు. “ఇది ఒక పొలిటికల్ స్టంట్ కూడా అయి ఉండవచ్చు. ఇక్కడ చాలా మంచి అభివృద్ధి పథకాలు ఉన్నాయి. అందరికి ప్రయోజనాలు అందుతున్నాయి. కాబట్టి, తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ ఇక్కడికి వచ్చి ఎన్నికలలో పోటీ ఇవ్వలేదు” అని శివసేన నేత కునాల్ నాగర్ వ్యాఖ్యానించారు.