ప్రైవేటు ల్యాబ్స్లో కరోనా టెస్టులు..ధరలపై కీలక నిర్ణయం
కరోనా వైరస్ కేసుల్లో చైనా, కెనడాల కంటే మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా టెస్టులు చేసి, వైరస్ సోకిన వారిని ముందే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వాలకు ఐసీఎంఆర్ సూచిస్తోంది.
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 లక్షల 8 వేల మందికి పైగా కరనా బారినపడగా..ఒక్క మహారాష్ట్రలోనే లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3,717 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ కేసుల్లో చైనా, కెనడాల కంటే మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా టెస్టులు చేసి, వైరస్ సోకిన వారిని ముందే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వాలకు ఐసీఎంఆర్ సూచిస్తోంది. దీంతో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు ప్రైవేటు ల్యాబ్స్లోనూ టెస్టు చేసేందుకు అనుమతి ఇచ్చాయి.
అయితే ప్రైవేటు ల్యాబ్స్ ల్లో కరోనా టెస్టుల అంటే…ఖర్చుతో కూడుకున్న పని. అయితే, ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయకుండా కట్టడి చేసేందుకు మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నిర్ధారణకు ప్రామాణికమైన టెస్టు ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు ప్రస్తుతం ల్యాబ్స్ రూ.4,400 వసూలు చేస్తున్నాయి. అయితే, ఈ ధరను సగానికి కుదించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇకపై రూ.2,200కు మించి చార్జ్ చేయకూడదని ఆదేశించింది. అయితే ఇంటి నుంచి శాంపిల్స్ సేకరించి, టెస్టులు చేస్తే.. వారి నుంచి రూ.2800 వరకు చార్జ్ చేయొచ్చని సూచించింది. ప్రభుత్వం సూచించిన గరిష్ఠ ధరలకు మించి ఎక్కువగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఆయా ప్రైవేటు ల్యాబ్స్, ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే స్పష్టం చేశారు.