మహారాష్ట్ర కౌన్సిల్ ఎన్నికలు, 4 సీట్లలో పాలక శివసేన కూటమి విజయం, బీజేపీ కి ఒకేఒక్కసీటు !
మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క స్థానంలో గెలిచింది. మొత్తం 5 సీట్లకు గాను నాలుగు స్థానాల్లో పాలక శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం దిశగా సాగుతున్నారు.
మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క స్థానంలో గెలిచింది. మొత్తం 5 సీట్లకు గాను నాలుగు స్థానాల్లో పాలక శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం దిశగా సాగుతున్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత పాటిల్ సహా పలువురు పార్టీ నేతలు ముఖ్యంగా పూణే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ అది ఫలించలేదు. ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితాలు తాము ఆశించినట్టు లేవని దేవేంద్ర ఫడ్నవీస్ అంగీకరించారు. మేం ఎక్కువ సీట్లు వస్తాయని భావించాం, కానీ ఒక్క సీటే గెలిచాం. మూడు పార్టీల మహా వికాస్ అఘాడీ శక్తిని అంచనా వేయలేకపోయాం అని ఆయన వ్యాఖ్యానించారు.
ఔరంగాబాద్, పూణే పట్టభద్రుల నియోజకవర్గాలను ఎన్సీపీ గెలుచుకుంది. ఏడాది కాల మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి, విపక్ష బీజేపీకి మధ్య ఇది తొలి ఎన్నిక ఫలితం. ఈ ద్వైవార్షిక ఎన్నికల్లో 12 లక్షలమందికి పైగా గ్రాడ్యుయేట్లు, టీచర్లు పాల్గొన్నారు. కౌన్సిల్ లో మొత్తం 78 సీట్లు ఉన్నాయి.
తనకు మంచి పట్టు ఉన్నపట్టభద్రుల నియోజకవర్గాలను బీజేపీ కోల్పోవడం విశేషం. ముఖ్యంగా నాగపూర్ విషయానికి వస్తే లోగడ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి గంగాధరరావు ఫడ్నవీస్ ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.