హ్యాట్సాఫ్.. యూఎన్ఏడీఏపీ గుడ్విల్ అంబాసిడర్గా బార్బర్ కుమార్తె…
యూఎన్ఏడీఏపీ (యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్) గుడ్విల్ అంబాసిడర్గా మధురైకు చెందిన బార్బర్ కుమార్తె నేత్ర(13) ఎంపికైంది.
యూఎన్ఏడీఏపీ (యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్) గుడ్విల్ అంబాసిడర్గా మధురైకు చెందిన బార్బర్ కుమార్తె నేత్ర(13) ఎంపికైంది. కోవిడ్-19 లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలు, రోజువారి శ్రామికుల వెతలు చూసి చలించిన నేత్ర తన ఉన్నత చదువు కోసం తండ్రి దాచిన రూ. 5 లక్షల నగదును పేదలకు సహాయం చేసేందుకు తండ్రిని ఒప్పించింది. తనకున్న స్థోమతతో చాలా పెద్ద సాయమే చేసింది. బాలిక గొప్పతనాన్ని, గుణాన్ని ఆ రాష్ట్ర మంత్రి సెల్లూరు రాజు ప్రశంసించారు. విద్యార్థినికి జయలలిత అవార్డును ఇవ్వాల్సిందిగా సీఎం పళనిస్వామికి సిఫార్సు చేశారు.
కాగా కొద్దిరోజుల క్రితం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ సైతం బాలికను, ఆమె తండ్రి మోహన్ నిర్ణయాన్ని అభినందించారు. మధురైకు గర్వకారణంగా వారు నిలిచారని కొనియాడారు. తన తండ్రి జీవిత కాలం వెచ్చించి సంపాదించిన మొత్తాన్ని, ఓ బాలిక తన భవిష్యత్తును కూడా ఆలోచించకుండా పేదలకు పంచడం గొప్ప విషయమన్నారు. నేత్ర త్వరలోనే న్యూయార్క్లో జరిగే యూనైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్, జెనివాలో జరిగే సివిల్ సొసైటీ ఫోరం కాన్ఫరెన్స్లో మాట్లాడనున్నట్లు మోదీ తెలిపారు.