నేడే బాబ్రీ కేసు తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం (సెప్టెంబర్ 30) తీర్పును వెలువరించనుంది. 28 ఏళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ కేసు తుది దశకు చేరుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం (సెప్టెంబర్ 30) తీర్పును వెలువరించనుంది. 28 ఏళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ కేసు తుది దశకు చేరుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో.. కేసులో నిందితులందరూ కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఎస్కే యాదవ్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. బాబ్రీ కేసులో మొత్తం 49మందిని నిందితులుగా గుర్తించగా.. వీరిలో 17మంది మరణించారు. మిగిలిన 32మంది నిందితుల జాబితాలో.. బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వాణీ, ఎమ్ఎమ్ జోషితో పాటు ప్రముఖ నేతలు ఉమాభారతి, కల్యాణ్ సింగ్ తదితరులు ఉన్నారు. తీర్పు నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు.
అయితే.. ఉమా భారతి ఇటీవలే కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె రిషికేష్ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు అనుమతి ఇస్తే కోర్టుకు హాజరవుతానని సోమవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ కేసు విచారణను సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేసి, తీర్పు వెలువరించాలని సుప్రీం కోర్టు ఇదివరకే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది.
చారిత్రక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా హైటెన్షన్ కొనసాగుతోంది. ముందు జాగ్రత్తగా కేంద్రం అలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. సున్నితం, సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మొహరించి భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాలకు సూచించింది. దర్యాప్తు తర్వాత అందిన ఆధారాలు, 351 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ తీర్పు ఇవ్వబోతుంది.
Also Read :