ఎట్టకేలకు తేలిన జిహెచ్ఎంసి పోలింగ్ పర్సంటేజ్.. గతంకంటే అత్యల్ప పెరుగుదల
ఎట్టకేలకు జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోలైన ఓట్లశాతం లెక్కతేలింది. ఎప్పటిలాగానే ఈసారి ఎన్నికల్లోనూ గ్రేటర్ ఓటరు ఓటింగ్ పై పెద్దగా ఆసక్తి చూపలేదు...
ఎట్టకేలకు జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోలైన ఓట్లశాతం లెక్కతేలింది. ఎప్పటిలాగానే ఈసారి ఎన్నికల్లోనూ గ్రేటర్ ఓటరు ఓటింగ్ పై పెద్దగా ఆసక్తి చూపలేదు. కేవలం 45.71 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అర్థరాత్రి దాటాక అధికారికంగా ప్రకటించింది. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే .44శాతం ఓటింగ్ పెరిగింది. 2016లో 45.27 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఇక, 2002 ఎంసిహెచ్ ఎన్నికల్లో 41.22, జిహెచ్ఎంసి ఆవిర్భావం తర్వాత 2009లో 42.95 శాతం పోలింగ్ జరిగింది.
అత్తాపూర్లో అత్యధికం 55.3 శాతం నమోదు కాగా… రాజేంద్రనగర్లో అత్యల్పంగా 21 శాతం పోలింగ్ నమోదైంది. ఇక పాతబస్తీలో 25 శాతానికి మించి పోలింగ్ జరగలేదు. పదిలోపు డివిజన్లలో మాత్రమే 50 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈసారి కూడా ఓటేయడానికి యువత అంతగా ఆసక్తి చూపలేదు. జిహెచ్ఎంసిలోని 30 సర్కిళ్లలో మొత్తం 150 డివిజన్లు ఉండగా, 149 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఓల్డ్ మలక్పేట డివిజన్లో సీపీఐ అభ్యర్థికి సీపీఎం గుర్తును కేటాయించడంతో పోలింగ్ జరగలేదు.