జనం బాటలో జనసేన.. లాంగ్ మార్చ్ కలిసొచ్చేనా ?
పోయిన చోటే వెతుక్కోవాలనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతోంది జనసేన. రాష్ట్రంలో పార్టీకి మంచి ఓటింగ్ నమోదైన విశాఖ నుంచి లాంగ్ మార్చ్కు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై గళం విప్పేందుకు రెడీ అయింది. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాలని చూస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా పార్టీని ఒక్కొక్కరూ వీడడంతో జనసేన డీలా పడింది. ఇప్పుడు లాంగ్ మార్చ్లోనూ జనసేనాని వెంట కీలక నేతలు ఎంతమంది వస్తారనేది సందేహంగానే ఉంది. ఇంతకీ లాంగ్ మార్చ్లో సేనాని వెంట నడిచేదెవరు […]
పోయిన చోటే వెతుక్కోవాలనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతోంది జనసేన. రాష్ట్రంలో పార్టీకి మంచి ఓటింగ్ నమోదైన విశాఖ నుంచి లాంగ్ మార్చ్కు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై గళం విప్పేందుకు రెడీ అయింది. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాలని చూస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా పార్టీని ఒక్కొక్కరూ వీడడంతో జనసేన డీలా పడింది. ఇప్పుడు లాంగ్ మార్చ్లోనూ జనసేనాని వెంట కీలక నేతలు ఎంతమంది వస్తారనేది సందేహంగానే ఉంది. ఇంతకీ లాంగ్ మార్చ్లో సేనాని వెంట నడిచేదెవరు ? ఇదే ఇప్పుడు జనసేనలో వినిపిస్తున్న ప్రశ్న.
జనసేన పార్టీకి కీలకమైన జిల్లా విశాఖ. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు వచ్చింది ఒకే ఒక్క సీటు. రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాభవం ఎదురైంది. అయినా విశాఖ జిల్లాలో జనసేన అభ్యర్థులకు ఓట్లు బాగానే పడ్డాయి. జనసేన నుంచి ఎంపీగా పోటీ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణకు 2లక్షల 88వేల ఓట్లు వచ్చాయి. పార్థసారథికి 82వేల ఓట్లు పడ్డాయి. ఇలా జనసేన నుంచి పోటీ చేసిన ప్రతీ అభ్యర్ధిగా బాగానే ఓట్లు పడ్డా… ప్రత్యర్థి ధాటికి నిలవలేకపోయారు. ఎన్నికల ఫలితాలు తర్వాత విశాఖ జనసేన కేడర్లో నిస్తేజం అలముకుంది. అధినాయకుడితో జిల్లా నాయకులకు సరైన కనెక్టివిటీ లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అందుకే గాజువాకలో సాక్షాత్తు పవన్ కల్యాణ్ ఓటమి పాలయ్యారన్న విశ్లేషణలున్నాయి.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కరు పార్టీని వీడడంతో జనసేన బలహీనపడింది. చింతల పార్థసారథి ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య సైతం జనసేనకు గుడ్ బై చెప్పేశారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఆ పార్టీలో చెప్పుకోదగ్గ నేతలెవరూ లేదు. మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ కూడా పార్టీలో అంత యాక్టివ్గా కన్పించడం లేదు. విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత కూడా లక్ష్మీనారాయణ యాక్టివ్గానే ఉన్నారు.
విశాఖ నియోజవకర్గంలో చాలా వరకు పార్టీ తరుపున పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. గత జూన్ నెలలోనూ వివిధ నియోజకవర్గాల్లో జరిగిన పార్టీ సమావేశాలకు అటెండయ్యారు. ఆ తర్వాత మళ్లీ కన్పించలేదు. దీంతో లక్ష్మీనారాయణ పార్టీ మారుతున్నట్లు… బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు కూడా వైరల్ అయ్యారు. దీంతో లక్ష్మీనారాయణ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తన వల్ల పార్టీకి ఉపయోగం ఉందని పవన్ ఫీలైనన్నీ రోజులు తాను పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు.
పవన్ మాత్రం లాంగ్ మార్చ్ను సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో నూతనోత్తేజం నింపాలని చూస్తున్నారు. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ వేదికగా పార్టీ గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇసుక కొరత – భవన నిర్మాణ కార్మికుల సమస్యలను విశాఖ వేదికగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి భారీ సంఖ్యలో కార్మికులు విశాఖకు వస్తుంటారు. వచ్చే నెల 3న భారీ స్థాయిలో లాంగ్ మార్చ్ను నిర్వహించనున్నారు. ఇప్పటికే లాంగ్ మార్చ్ను విజయవంతం చేసేందుకు జన సైనికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ లాంగ్ మార్చ్లో పవన్ ఒంటరిగానే ముందుకెళ్తారా ? లేక పార్టీలో లక్ష్మీనారాయణ లాంటి నేతలు ఆయన వెంట నడుస్తారా అన్నది చూడాలి !