రైలులో రష్ తట్టుకోలేక కారు కొనుక్కోని సొంతూరికి..
రైలు రద్ధీని తట్టుకోలేక కారు కొనుగోలు చేసుకుని సొంతూరుకు ప్రయాణం
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా చిత్ర విచిత్ర విన్యాసాలు చేయిస్తోంది. రైలు రద్ధీని తట్టుకోలేని ఒక వ్యక్తి కారు కొనుగోలు చేసుకుని మరీ సొంతూరుకు చేరాడు. యూపీలోని గోరఖ్పూర్కు చెందిన ఒక వ్యక్తి ఘజియాబాద్లో ఉంటున్నాడు. లాక్డౌన్తో ఉపాధి కరువై భార్యతో సహా సొంతూరు వెళ్లాలనుకున్నాడు. రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న జనాన్ని చూసి, ఆ రైలులో తాను, తన భార్య వెళ్లడం కష్టమని భావించాడు. అక్కడ సమాజిక దూరం అస్సలు పాటించడం లేదని కనీస జాగ్రత్తలు ఎవరు తీసుకోవడంలేదని.. కరోనా బారిన పడక తప్పదని భావించాడు. దీంతో వెంటనే ఒక కారును కొనుగోలు చేసి, దానిలో తాను, తన భార్యతో ప్రయాణించి ఇంటికి చేరుకున్నారు. పిపిగంజ్ ప్రాంతంలోని కైతోలియా గ్రామానికి చెందిన లల్లన్ ఘజియాబాద్లో పెయింట్, పాలిష్ పని చేస్తుంటాడు. భార్యాభర్తలు అక్కడే ఉంటున్నారు. లాక్డౌన్ కారణంగా అతను ఉపాధి కోల్పోయాడు. దీంతో స్పెషల్ రైలులో స్వస్థలానికి చేరుకోవాలని అనుకున్నాడు. అయితే స్టేషన్లో ఉన్నజనాన్ని చూసి కంగారు పడ్డాడు. అయినా రైలులో సీటు దొరుకుతుందేమోనని మూడు రోజుల పాటు ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడంతో తాను బ్యాంకులో దాచుకున్నరూ.1.50 లక్షలతో సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు. మే 31 ఉదయం 11 గంటలకు గోరఖ్పూర్నకు బయలుదేరాడు. 14 గంటల ప్రయాణం తరువాత తన గ్రామమైన రాంపూర్ కాథోలియాకు చేరుకున్నారు. లల్లన్కు కారు నడపడం రానప్పటికీ డ్రైవర్ను ఏర్పాటు చేసుకుని మరీ సొంతూరు చేరుకున్నాడు. అయితే, కరోనా మహమ్మారి ఎంత వారినైనా వదలడం లేదని, ప్రాణాల కన్న డబ్బు ముఖ్యం కాదని కారులో ప్రయాణించామని చెప్పుకొచ్చాడు లల్లన్.