జూన్ 15వరకు లాక్డౌన్..! కొత్త నిబంధనలు ఇవే..
భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 7964 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్నటితో పోల్చుకుంటే అదనంగా దాదాపు 500 కేసులు ఎక్కువ నమోదు అయ్యాయి. దీంతో దేశంలో..
భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 7964 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్నటితో పోల్చుకుంటే అదనంగా దాదాపు 500 కేసులు ఎక్కువ నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 73వేల 763కి చేరుకుంది. ఇటు 24 గంటల్లో దేశంలో 265 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 4971 కి చేరింది. ఇటువంటి తరుణంలోనే కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ 4.0 ఈ నెల 31తో ముగియనుండగా కేంద్రం తదుపరి తీసుకోబోయే నిర్ణయం పైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
దేశంలో మరోమారు లాక్డౌన్ పొడిగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గుచూపతున్నాయని తెలుస్తోంది. కనీసం మరో రెండు వారాల పాటు(జూన్ 15 వరకు) లాక్డౌన్ పొడిగించేందుకు కేంద్రం సిద్ధపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోమారు లాక్డౌన్ పొడిగిస్తే..నిబంధనలను మరింత కఠినతరం చేయాలా లేక సడలించాలా అనే నిర్ణయాధికారాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం..రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, రాష్ట్రాలకు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ కేంద్రం సమన్వయం చేయనుంది. విద్యా సంస్థలు, మెట్రో సేవల పున:ప్రారంభంపై ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకునేలా కేంద్రం వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మీక ప్రాంతాలైన ఆలయాలు, మసీదులు, చర్చిల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం కానుంది.
ఇకపోతే, వైరస్ అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న వాటిపై నిషేధం కొనసాగనుందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ విమాన సేవలు, రాజకీయ సమావేశాలు, మాల్స్, థియేటర్లపై నిషేధం కొనసాగే అవకాశం ఉంది. అలాగే 80 శాతం కరోనా కేసులు నమోదైన 30 మున్సిపాలిటీల్లో మాత్రం కఠిన ఆంక్షలు విధించక తప్పదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తెలిపింది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, బెంగాల్ , రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిశాలో ఈ 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. కరోనా మరింతగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మాస్క్ ధరించటం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. జనసమూహాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
వివిధ నగరాల్లో కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాపిస్తుండడానికి గల కారణాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే లాక్డౌన్కు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే ముందు..వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులు, మునిసిపల్ కమిషనర్లతో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్ మాట్లాడినట్లు సమాచారం. ప్రధాని మోదీతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. లాక్డౌన్ అంశంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను, సలహాలను ప్రధానికి వివరించారు. ప్రధాని నరేంద్రమోదీ రేపటి మన్కీ బాత్ కార్యక్రమంలో లాక్డౌన్ పొడిగింపుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.