ఎమర్జెన్సీలో ఫైజర్ ఇతర వ్యాక్సిన్ల లోకల్ ట్రయల్స్ తప్పనిసరి, నీతి ఆయోగ్ కొత్త నిబంధన, ఎల్లుండి నుంచే వ్యాక్సినేషన్
దేశంలో ఏ వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థ అయినా తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిని పొందాలనుకుంటే ఇందుకు లోకల్ క్లినికల్ ట్రయల్ తప్పనిసరిగా నిర్వహించాలని..
Covid Vaccine: దేశంలో ఏ వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థ అయినా తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిని పొందాలనుకుంటే ఇందుకు లోకల్ క్లినికల్ ట్రయల్ తప్పనిసరిగా నిర్వహించాలని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ 19 పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ హెడ్ డాక్టర్ వి.కె.పాల్ తెలిపారు. ఇది ఓ ప్రీ-కండిషన్ అని పేర్కొన్నారు. ఈ నిబంధన ఫైజర్ టీకామందుకు కూడా వర్తిస్తుందన్నారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఫైజర్ టీకామందును వేలాదిమంది తీసుకున్నా మన దేశానికి వచ్ఛేసరికి ఇది ప్రీ కండిషన్ గా నిర్ధారించామన్నారు. ఇప్పటివరకు కోవిషీల్డ్, కొవాగ్జిన్ టీకామందులకు ఎమర్జెన్సీ వినియోగానికి సంబంధించి అనుమతి లభించింది. తమ కోవిషీల్డ్ మందు కోసం సీరం సంస్థ 1500 మందికిపైగా వలంటీర్లపై నెలరోజులకు పైగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది.
ఇక భారత్ బయో టెక్ సంస్థ.. తమ కొవాగ్జిన్ వ్యాక్సిన్ మొదటి, రెండు ట్రయల్స్ నిర్వహించింది. మూడో దశ ట్రయల్స్ నిర్వహించే సన్నాహాల్లో ఉంది. కానీ ఈ ట్రయల్స్ పూర్తి కానిదే ఈ టీకామందు అత్యవసర వినియోగానికి ఎలా అనుమతినిచ్చారని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.