బీరూట్లో ఎమర్జెన్సీ విధించిన లెబనాన్ సర్కార్
పేలుళ్లతో దద్దరిల్లిన బీరూట్లో ఎమర్జెన్సీ విధిస్తూ లెబనాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఆగస్టు 4న బీరూట్ తీరంలో ఆమోని నిల్వల కారణంగా భారీ పేలుడు సంభవించింది.
పేలుళ్లతో దద్దరిల్లిన బీరూట్లో ఎమర్జెన్సీ విధిస్తూ లెబనాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఆగస్టు 4న బీరూట్ తీరంలో ఆమోని నిల్వల కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. వందలాది భవనాలు నేల మట్టమయ్యాయి. ఈ ఘటనపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో లెబనాన్ లో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఘటనకు బాధ్యత వహిస్తూ లెబనాన్ క్యాబినెట్ రాజీనామా చేసింది. అయితే, అంతకుముందే ఆగస్టు 5న బీరూట్లో రెండువారాల పాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంపై గురువారం లెబనాన్ పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించారు. ఎమర్జెన్సీకి పార్లమెంట్ ఆమోదం తెలుపడంతో ఆదేశ సైన్యానికి అపరిమిత అధికారాలు కట్టబెడుతూ పార్లమెంట్ తీర్మానం చేసింది. మరోవైపు ప్రజాగ్రహాన్ని అణచివేయడానికే ఎమర్జెన్సీ విధించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చడానికి ప్రజలపై ఎమర్జెన్సీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.