కరోనా అప్డేట్ః వెలుగులోకి కొత్త విషయం.. కోలుకోవాలంటే 25 రోజులే !
కొవిడ్-19 బారిన పడినవారు పూర్తిగా కోలుకోవడానికి సుమారు 25 రోజులు పడుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
కరోనా వైర్సకు సంబంధించి రోజురోజుకూ కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. తొలిసారిగా కరోనా బయటపడిన చైనా సహా ఇతర దేశాల్లోని హాట్స్పాట్ కేంద్రాల్లో జరిపిన అధ్యయనంలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
కొవిడ్-19 బారిన పడినవారు పూర్తిగా కోలుకోవడానికి సుమారు 25 రోజులు పడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. వ్యక్తులు, వారి వయసు, లక్షణాలు బయటపడిన సమయం, లభించిన చికిత్స, ఆరోగ్య స్థితిని బట్టి కోలుకునే రోజుల్లో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయని విశ్లేషకులు వెల్లడించారు. 80 ఏళ్లు అంతకు మించిన వయసున్నవారిలో మరణాల శాతం ఎక్కువేనని అధ్యయనంలో తేలింది. అత్యధిక సమూహ ప్రమాదాల రేటు 13.4 శాతంగా పేర్కొన్నారు.
కరోనా వైరస్ లక్షణాల తీవ్రత తక్కువగా ఉండటం, ఇతర తేలికపాటి కేసులను పరిగణనలోకి తీసుకుంటే మరణాల శాతం కేవలం 0.66 మాత్రమే ఉంటుంది. చైనాలో నమోదైన కేసులతో పోలిస్తే మరణాల రేటు 1.38 శాతం. అయితే వైరస్ సోకిన ప్రతి ఒక్కరికీ ఐసియులో చికిత్స అవసరం ఉండదు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స అందించాలి. 60 ఏళ్ల వయసున్న బాధితుల విషయంలో 11.8 శాతం, 70 ఏళ్లు ఉన్న వారిలో అయితే 16.6 శాతం, 70 ఏళ్లు మించి ఉన్నట్లయితే 18.4 శాతం తీవ్రతను బట్టి ఆసుపత్రిలో చికిత్స అవసరం. 80 ఏళ్లు పైబడిన వారు అయితే తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్పించాలని పరిశోధకులు పేర్కొన్నారు.