జాతీయ రాజకీయాల్లో జగన్ మార్క్..!
రాజ్యసభ ఎన్నికల్లో ఏపీలో అధికార వైసీపీ విజయం సాధించింది. పోటీ చేసిన నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. నెమ్మదిగా జాతీయ రాజకీయాల్లో ప్రాబల్యం చూపించేలా వైఎస్సార్ కాంగ్రెస్ తన ప్రస్థానాన్ని సాగిస్తోంది.
రాజ్యసభ ఎన్నికల్లో ఏపీలో అధికార వైసీపీ విజయం సాధించింది. పోటీ చేసిన నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. నెమ్మదిగా జాతీయ రాజకీయాల్లో ప్రాబల్యం చూపించేలా వైఎస్సార్ కాంగ్రెస్ తన ప్రస్థానాన్ని సాగిస్తోంది. ఇప్పటికే లోక్ సభలో 22 సీట్లతో నాలుగవ అతిపెద్ద పార్టీగా అవతరించింది వైసీపీ. రాజ్యసభలో వైస్సార్సీపీకి గతంలో 2 సీట్లు ఉండగా..తాజాగా గెలిచిన 4 సీట్లతో మొత్తం 6 స్థానాలు సంపాదించింది. ఈ లెక్కన ఏపీలో ఉన్న మొత్తం 11 రాజ్యసభ స్థానాల్లో వైసీపీ నుంచి 6 గురు..బీజేపీ నుంచి 4గురు..టీడీపీ నుంచి ఒక్కరు ఎగువ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
అయితే ఎక్కువ పార్లమెంట్ మెంబర్స్ ని కలిగి ఉండి..అటు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకి కానీ, ఇటు ప్రతిపక్ష యూపీఏకి కానీ మద్దతు తెలుపకుండా స్థిరంగా అడుగులు వేస్తోంది జగన్ లీడ్ చేస్తోన్న వైసీపీ పార్టీ. ఈ విషయంలో వైసీపీ అధినేత నేర్పుగా వ్యవహరిస్తున్నారే చెప్పాలి. కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వకుండా..కీలకమైన బిల్లులు, నిర్ణయాల విషయంలో మద్దతు తెలుపుతూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం మాత్రమే అయ్యింది. ఇంకా నాలుగేళ్ల పరిపాలన మిగిలుంది. మరోవైపు రాష్ట్రం ఆర్థిక లోటులో ఉంది. సంక్షేమ కార్యక్రమాల లిస్ట్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర సాయం తప్పనిసరిగా అవసరం. అందుకే కేంద్ర పెద్దలతో సఖ్యత ప్రదర్శిస్తున్నారు సీఎం జగన్. అటు తమకు ప్రత్యేక హోదా ఇచ్చిన పార్టీకే కేంద్రంలో మద్దతిస్తామని ఎన్నికలకు ముందు పలు వేదికలపై వ్యాఖ్యానించారు. అందుకే మాట తప్పారనే అపవాదు రాకుండా బీజేపీకి ప్రత్యక్ష మద్దతు ఇవ్వకుండా దూరంగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఈ దోరణితో సవ్యంగానే పాలన సాగిస్తున్నారు సీఎం జగన్. మున్ముందు జాతీయ రాజకీయాల్లో వైసీపీ ఎటువంటి పాత్ర పోషించబోతుంది..వచ్చే ఎన్నికల్లో వైసీపీ భూమిక ఎలా ఉండబోతుంది. ఒక పార్టీకి మద్దతు తెలపాల్సిన సమయం వచ్చినప్పుడు జగన్ ఏ స్టాండ్ తీసుకుంటారు..అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.