‘వైఎస్ఆర్ కాపు నేస్తం’ అర్హులైన వారికి మరో అవకాశం…
కరోనా కాలంలో కూడా వరుస పెట్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్న ఏపీ సీఎం జగన్ తాజాగా 'వైఎస్సార్ కాపు నేస్తం' పధకాన్ని నేడు ప్రారంభించారు.
కరోనా కాలంలో కూడా వరుస పెట్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్న జగన్ ప్రభుత్వం తాజాగా మహిళల కోసం మరో పథకాన్ని ప్రారంభించింది. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45-60 ఏళ్లు వయసున్న మహిళలను ఆదుకునేందుకు ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పధకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో నేడు ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కి సుమారు 2,35,873 మంది లబ్దిదారులకు రూ. 15 వేలు చొప్పున రూ. 354 కోట్లు వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేశారు. ఈ పధకం ద్వారా మహిళలకు ప్రతీ ఏటా రూ. 15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ. 75 వేల ఆర్ధిక సహాయం అందించనున్నారు.
ఇదిలా ఉంటే ఈ పథకం కింద లబ్ది పొందేందుకు అర్హత ఉండి అనుకోని కారణాల వల్ల జాబితాలో పేర్లు లేనివారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అర్హత ఉండి, జాబితాలో పేరు లేనివారు ఉంటే.. వెంటనే గ్రామ/ వార్డు సచివాలయంకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఆ దరఖాస్తులను పరిశీలించి.. ఆ తర్వాత ఆమోదించి.. జూలై నెలలో ఇదే రోజున వారికి కూడా తప్పనిసరిగా ఆర్ధిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ 13 నెలలో పాలనలో సుమారు 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేశామన్నారు. ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకే నగదు జమ చేశామని తెలిపారు. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వాహనమిత్ర, జగనన్న చేదోడు, విదేశీ విద్యా దీవెన, కాపు నేస్తం వంటి సంక్షేమ పథకాల ద్వారా 23 లక్షలకు పైగా కాపు సామాజికవర్గ లబ్ధిదారులకు రూ.4770 కోట్లు ఇచ్చామన్నారు.
“వైయస్ఆర్ కాపు నేస్తం“ పథకం ద్వారా 2,35,873 మంది లబ్ధిదారులకు రూ.354 కోట్లకు పైగా ఆర్థిక సాయం చేస్తోంది వైయస్ జగన్ సర్కార్.#YSRKapuNestham pic.twitter.com/zumeXqRL7J
— YSR Congress Party (@YSRCParty) June 24, 2020