ఆ అడుగు పడి సరిగ్గా మూడేళ్లు
దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనం..చరిత్రాత్మకంగా నిలిచి పోయిన ప్రజా సంకల్ప యాత్రను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించి నేటికి సరిగ్గా మూడేళ్లు.
ఓ రాజకీయ నాయకుడి యాత్ర దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఓ అద్వితీయ విజయానికి నాంది పలికింది. చరిత్రాత్మకంగా నిలిచి పోయిన ప్రజా సంకల్ప యాత్రను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించి నేటికి సరిగ్గా మూడేళ్లు. ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6వ తేదీన జగన్ ప్రజా సంకల్పానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఈ పాదయాత్రలో అలుపెరగని పోరాటం సాగించారు. 14 నెలల పాటు 13 జిల్లాల్లో సుదీర్ఘంగా ప్రజల కష్టాలు వింటూ, నేను విన్నాను..నేను ఉన్నాను అంటూ ముందుకు సాగారు. 2019 జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో ఈ యాత్ర ముగిసింది.
13 జిల్లాల్లో 6 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందని తొలుత పార్టీ వర్గాలు భావించినా, చివరకు అది 14 నెలల పాటు సాగింది. 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రకు స్వస్తీ పలుకుతూ పైలాన్ను ఆవిష్కరించారు. మొత్తం 3,648 కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్రను సాగించారు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 62 నగరాలు, పట్టణాలు… 231 మండలాల పరిధిలోని 2,516 గ్రామాలలో జగన్ పర్యటించారు. 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో భాగమయ్యారు. కనిపించిన ప్రతి మనిషిని ఆయన అక్కున చేర్చుకున్నారు. చెప్పుకున్న ప్రతి కష్టాన్ని సావధానంగా విన్నారు. తన ప్రభుత్వం వస్తే సుపరిపాలన అందిస్తానని భరోసా ఇచ్చారు. అధికారం ఇస్తే తాను చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికుండాలన్న ఆశతో పాలన సాగిస్తానని జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభ సభలో ప్రజలకు మాట ఇచ్చారు.
ఆపై ప్రజా సంకల్ప యాత్ర ముగిశాక కూడా జనం మధ్యనే ఉంటూ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. కని,విని ఎరుగని రీతిలో 151 అసెంబ్లీ, 22 లోక్సభా స్థానాల్లో గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Also Read : మాజీ మావోయిస్టు పద్మావతి అలియాస్ పద్మక్క అరెస్ట్