‘గాల్వన్’పై చైనా కన్ను.. ఎందుకంటే..?
ఒక వైపు కరోనా వైరస్కు కారణమై ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న చైనా ఇప్పుడు భారత్ నూ కవ్విస్తోంది. తూర్పు లఢక్లోని గాల్వన్ లోయలో సోమవారం (జూన్ 15) రాత్రి భారత్-చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం
Galwan Valley: ఒక వైపు కరోనా వైరస్కు కారణమై ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న చైనా ఇప్పుడు భారత్ నూ కవ్విస్తోంది. తూర్పు లఢక్లోని గాల్వన్ లోయలో సోమవారం (జూన్ 15) రాత్రి భారత్-చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం.. తీవ్ర హింసాత్మక ఘర్షణలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో ఒక కమాండింగ్ అధికారితో పాటు 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. 1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరిగిన ప్రాంతాల్లో గాల్వన్ కూడా ఉంది. గల్వాన్ లోయ దగ్గర భారత్కు చెందిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్.. 255 కిలోమీటర్ల హైవేని నిర్మిస్తోంది. ఈ హైవేపై ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ప్రయాణించే వీలుంది. ఇది పూర్తైతే భారత సైనికులు అరగంటలోపే గాల్వన్ లోయకు వెళ్లగలరు. అదే రోడ్డు లేకపోతే 8 గంటలు పడుతుంది.
కాగా.. చైనా ఆ రోడ్డును నిర్మించడానికి వీల్లేదంటోంది. ఆ విషయాన్ని డైరెక్టుగా చెప్పకుండా.. ఇలా గాల్వన్ లోయలోకి ఆర్మీని పంపి, ఆ భూభాగం తనదే అంటోంది. ఇక్కడే రెండు దేశాల మధ్యా వివాదం నడుస్తోంది. ఈ వివాదం ఐదు వారాలుగా నడుస్తోంది. కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగాక… రెండువైపులా సైన్యం వెనక్కి వెళ్లాలని నిర్ణయం వెలువడింది. తీరా… వెనక్కి వెళ్తూ… చైనా సైన్యం రెచ్చగొట్టడంతో ఘర్షణ జరిగి రెండువైపులా ప్రాణ నష్టం జరిగిందని అంటున్నారు. గాల్వన్ లోయలో హైవే నిర్మాణ పనుల కోసం జార్ఖండ్ నుంచి 1600 కార్మికుల్ని భారత్ తరలించిన వెంటనే ఈ ఘర్షణ జరిగింది. గాల్వన్ లోయతోపాటు ప్యాంగాంగ్ సరస్సు, దెమ్చోక్, దౌలత్బేగ్ ఓల్డీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి ఉంది.