టీటీడీ ఆస్తులను విక్రయించం : ఈవో
శ్రీవారి ఆస్తులను ఇకపై విక్రయించకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం తీర్మానం చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ ఏపీ హైకోర్టుకు నివేదించారు.
శ్రీవారి ఆస్తులను ఇకపై విక్రయించకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం తీర్మానం చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ ఏపీ హైకోర్టుకు నివేదించారు. తమిళనాడులోని 23 ఆస్తుల్ని విక్రయించాలని టీటీడీ నిర్ణయించిందని, ఆ వేలాన్ని అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ బీజేపీ నేత అమర్ నాథ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు సమగ్ర నివేదిక సమర్పించాలని టీటీడీ పాలక మండలిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. గత మే 28న టీటీడీ తీర్మానం చేసిందని, 1974 నుంచి విక్రయించిన ఆస్తుల వివరాలపై శ్వేతపత్రం ప్రచురించాలని కూడా నిర్ణయించామని పేర్కొన్నారు. ఆస్తుల సంరక్షణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించామన్నారు. టీటీడీకి చెందిన 50 ఆస్తులను విక్రయించేందుకు అనువుగా 2016 జనవరిలో చేసిన తీర్మానాన్ని పక్కన పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం గత మే 25న జీవో జారీ చేసిందన్నారు.
భక్తులు ఇచ్చిన ఆస్తులను స్వీకరించాక, వాటిపై తగిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ టీటీడీకి ఉందని ఈవో హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ మేరకు సింఘాల్ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. టీటీడీ ఆస్తుల్ని విక్రయించడాన్ని సవాల్ చేస్తూ అమర్ నాథ్ పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ డి.రమేశ్తో కూడిన ధర్మాసనం సోమవారం మరోమారు విచారణ జరిపింది.