గిరిజనులను వణికిస్తున్న మరో భయం..ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్..జల్లెడ పడుతున్న పోలీసులు
ఏఓబీలో ల్యాండ్ మైన్స్ ఫియర్. అడుగడుగునా మందుపాతరలే. భద్రతా బలగాలే వారి టార్గెట్. అదమరిచారా ఇక అంతే. పోలీసులకు కీలక సమాచారం అందడంతో అలెర్ట్ అయ్యారు. అటవీ ప్రాంతంలో అమర్చిన మందుపాతరలను కనుకొనే పనిలో పడ్డారు...
Landmines set up by Maoists : ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్లు మధ్య నిత్యం వార్ జరుగుతూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు వ్యూహా ప్రతివ్యూహాలతో ముందుకు కదులుతుంటారు. ఈ క్రమంలో రెండు వర్గాలు ఎదురుపడినప్పుడు కాల్పులు జరుగుతాయి. చాలా సందర్భాల్లో మావోయిస్టులు చనిపోవడం లేదా.. తప్పించుకుని పారిపోవడమో జరుగుతుంది. కొన్ని సందర్భాల్లోనే భద్రతా బలగాలకు నష్టం కలుగుతుంది. ఒక్కోసారి మావోయిస్టులు స్థానిక గిరిజనుల సాయంతో పోలీసులను టార్గెట్ చేసేవారు.
అయితే ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది. గిరిజనులకు సమాచారం ఇవ్వకుండా మావోయిస్టులు తమ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇటీవల చింతలవీధి అడవుల్లో పేలిన ఓ ల్యాండ్ మైన్కు ఇద్దరు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి మావోయిస్టులపై స్థానిక గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇటీవల పోలీసులకు లొంగిపోయిన కొంతమంది మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏవోబీలోని 5 గ్రామాల పరిధిలో మందుపాతరలు అమర్చినట్టు సమాచారం తెలుసుకుని ఉలిక్కిపడ్డారు. పెద్దబయలు మండలం నానాబరి, జామిగూడ, సాలేబు, చింతలవీధితోపాటు ముంచంగిపుట్టు మండలం సరియపల్లి, జి.మాడ్గులో మందుపాతరలు అమర్చినట్టు నిర్థారణకు వచ్చారు.
దాంతో భద్రతా బలగాలు స్థానిక గిరిజనులను అప్రమత్తం చేశారు. ఎవరూ కొండప్రాంతం, అడవులవైపు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల హెచ్చరికలతో గిరిజనులకు మందుపాతరల భయం పట్టుకుంది. ఎక్కడా ఏ మందుపాతర పేలుతుందోనన్న టెన్షన్ వారిలో నెలకొంది.
మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూసునార్లో పోలీసులకు భారీ ప్రమాదం తప్పింది. రహదారిలో పాతిన మందుపాతరను పోలీసులు గుర్తించారు. బాంబు స్క్వాడ్ను రప్పించి మందుపాతరను నిర్వీర్యం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.