టాప్ 10 న్యూస్ @ 6 PM
1.నా ఇంట్లోనూ ఐటీ దాడులకు వెల్కమ్ : మోదీ నేను కావాలనే ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు చేయిస్తున్నానని కొంతమంది విమర్శిస్తున్నారు.. కావాలంటే నా ఇంట్లో కూడా సోదాలు చేయమనండి అన్నారు ప్రధాని మోదీ. వారణాసిలో నామినేషన్ వేసిన అనంతరం భారీ రోడ్ షోలో పాల్గొన్నారు మోదీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో నేతల ఇండ్లపై ఐటీ దాడులు జరగడం లేదని, చట్టం ప్రకారమే ఆ సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. నేను ఏదైనా […]
1.నా ఇంట్లోనూ ఐటీ దాడులకు వెల్కమ్ : మోదీ
నేను కావాలనే ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు చేయిస్తున్నానని కొంతమంది విమర్శిస్తున్నారు.. కావాలంటే నా ఇంట్లో కూడా సోదాలు చేయమనండి అన్నారు ప్రధాని మోదీ. వారణాసిలో నామినేషన్ వేసిన అనంతరం భారీ రోడ్ షోలో పాల్గొన్నారు మోదీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో నేతల ఇండ్లపై ఐటీ దాడులు జరగడం లేదని, చట్టం ప్రకారమే ఆ సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. నేను ఏదైనా తప్పు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నా ఇంట్లోనూ దాడులు చేస్తుందని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వాళ్లు తప్పులు చేస్తున్నారేమో.. అందుకే భయపడి ఇలా విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే.. తాను ఇప్పటికే గెలిచినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారని.. ఆ ప్రచార ఉచ్చులో పడొద్దని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. భారీ సంఖ్యలో తరలివెళ్లి ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.
2.జయలలిత మృతి కేసు విచారణపై సుప్రీం స్టే!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో జస్టిస్ అర్ముగస్వామి కమిటీ విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విచారణ కమిటీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో అపోలో ఆస్పత్రి దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈక్రమంలో ఆపోలో ఆస్పత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ ఈ కేసును విచారించి..జస్టిస్ అర్ముగ స్వామి కమిటీ విచారణపై స్టే విధించింది. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం అర్ముగస్వామి కమిటీని నియమించింది.
3.ముస్లింలు ఉగ్రవాదులు కాదు… వారిని అలా చూడొద్దు: శ్రీలంక అధ్యక్షుడు
శ్రీలంకలో ఆదివారం ఈస్టర్ పండుగ నాడు ఉగ్రవాదులు చర్చిలు, హోటళ్లపై ఆత్మాహుతి దాడులు చెయ్యడం…వందల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు తీసుకోవడం.. వాటి వెనక తామే ఉన్నామని ఐసిస్ ప్రకటించడం… న్యూజిలాండ్లో ముస్లింలపై దాడులకు నిరసనగా ఈ దాడులు చేసినట్లు చెప్పడంతో… సహజంగానే శ్రీలంకలో ముస్లింలపై ఒక రకమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ పరిస్థితిని గమనించిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన… తమ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో మైనార్టీ వర్గంగా ఉన్న ముస్లింలను ఉగ్రవాదులుగా చూడొద్దని కోరారు. దాడుల పేరుతో మత కల్లోలాలు సృష్టించవద్దని పిలుపునిచ్చారు. ఐసిస్ ఉగ్రవాదుల చర్యల్ని పూర్తి స్థాయిలో అడ్డుకునే శక్తి సామర్ధ్యాలు తమకు ఉన్నాయన్నారు.
4.పేలుళ్ల సూత్రధారుల్లో ముగ్గురు మహిళలు..!
శ్రీలంకలో వరుస పేలుళ్లకు పాల్పడిన అనుమానితుల ఫొటోలను రిలీజ్ చేశారు ఆ దేశ అధికారులు. మొత్తం ఆరుగురు అనుమానితుల ఫోటోలను విడుదల చేశారు. వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. దాడుల తర్వాత లంకలో దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించగా.. అనుమానాస్పదులుగా భావించిన 76 మందిని అరెస్ట్ చేశారు. నేషనల్ తౌహీద్ జమాత్కు చెందిన 9 మంది సూసైడ్ బాంబర్లు వరుస పేలుళ్లకు పాల్పడినట్లు లంక పోలీసులు మొదట ప్రకటించారు. పేలుళ్ల ఘటన వెనక స్థానిక ఎన్టీజే సంస్థ హస్తం ఉందని దర్యాప్తు సంస్థలు కూడా నిర్థారించగా, అది తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ – ఐసిస్ ప్రకటించుకుంది. కాగా.. పేలుళ్లలో 359 మంది మరణించినట్లు మొదట అధికారులు ప్రకటించారు. అయితే.. మృతులను రెండు సార్లు లెక్కించడం వల్ల ఆ తప్పు జరిగిందని, పేలుళ్లలో చనిపోయిన మృతులు 253 మంది మాత్రమేనని తేల్చారు.
5.శ్రుతీతో బ్రేకప్.. ఆమె తన ఫ్రెండ్ మాత్రమేనంటున్న మైఖేల్
లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతీ హాసన్ పలు సినిమాల్లో తన నటనతో మెప్పించింది. అయితే గత రెండు, మూడు సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ మ్యూజిక్ ప్రోగ్రామ్లు చేసుకుంటోన్న ఈ బ్యూటీ.. ఇటీవలే విజయ్ సేతుపతితో రీ ఎంట్రీకి ఓకే చెప్పింది. అంతేకాదు తెలుగులోనూ ఆమె సినిమా స్క్రిప్ట్లను వింటున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కనపెడితే తాజాగా శ్రుతీ, ఆమె ప్రియుడు మైఖేల్ల బంధానికి బ్రేకప్ పడినట్లు తెలుస్తోంది.
కొంతకాలంగా తనతో చెట్టాపట్టాలేసుకు తిరిగిన శ్రుతీకి లండన్కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సేల్ గుడ్బై చెప్పినట్లు తాజా వార్త. ఆమె తనకు బెస్ట్ ఫ్రెండ్గానే ఉంటుందంటూ మైఖేల్ కోర్సేల్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ‘‘ఈ యంగ్ లేడీ ఇకపై నాకు జీవితాంతం స్నేహితురాలిగా ఉండిపోతుంది. ఆమెకు ఎప్పుడూ ఫ్రెండ్గా ఉండటం నా అదృష్టం. లవ్ యు గర్ల్ ’’అంటూ ఆయన ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా శ్రుతీ హాసన్తో తీసుకున్న ఓ ఫొటోను కూడా మైఖేల్ షేర్ చేశాడు.
కాగా 2016లో శ్రుతీ ఓ ప్రోగ్రామ్ నిమిత్తం లండన్ వెళ్లినప్పుడు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మైఖేల్ను కలిసింది. ఆ తరువాత ఇద్దరి మధ్య మొదలైన స్నేహం చివరకు ప్రేమగా మారింది. ఈ క్రమంలో శ్రుతీ ఇంట్లో జరిగే పలు శుభకార్యాలకు మైఖేల్ కూడా హాజరయ్యాడు. అంతేకాదు కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’లోనూ మైఖేల్ రష్యన్ సోల్జర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
6.రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా.. కరీంనగర్లో దారుణం
కరీంనగర్లో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. ల్యాండ్ విషయంలో ఓ వ్యక్తిని రక్తం కారేలా చితక్కొట్టారు. తలపై బండరాళ్లతో మోదీ తీవ్రంగా గాయపరిచారు. అడ్డుకున్న బాధితుడి కుటుంబ సభ్యులను చితకబాదారు. ఆడపిల్ల అని కూడా చూడకుండా కాళ్లతో తన్నుతూ నానా బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో గాయపడిన స్థల యజమాని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తలపై తీవ్రగాయాలు కావడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
భరత్ నగర్లో నివాసముంటున్న శ్రీనివాస్ రెడ్డికి 266 గుంటల స్థలం ఉంది. దాదాపు 30ఏళ్ల కిందట రిజిస్టర్ చేసుకున్నాడు. వారం కిందట ఈ స్థలం చుట్టూ ప్రహరీ గోడ కట్టుకునేందుకు సామాగ్రిని తెచ్చుకున్నారు. అయితే ఈ స్థలం తమదంటూ స్థానికంగా ఉండే సర్దార్ రాజ్దీర్ సింగ్, రాపోలు శంకర్, యస్పాల్ సింగ్, బొంతల ప్రవీణ్ అనే వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. దీంతో షాక్ తిన్న శ్రీనివాస్ రెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. దొంగ రిజిస్టర్ చేసుకుని తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ల్యాండ్ మాఫియాలోని ఓ వ్యక్తి ఒక్కసారిగా రెచ్చిపోయాడు. అక్కడే ఉన్న కలుపు పారతో స్థల యజమాని తలపై గట్టిగా మోదాడు. అడ్డొచ్చిన యజమాని కుటుంబ సభ్యులను చితకబాదాడు.
తన తండ్రిపై దాడి చేస్తున్న వ్యక్తులను అడ్డుకునేందుకు బాధితుడి కూతురు ప్రయత్నించింది. అయినా ఆడపిల్ల అని చూడకుండా ఆ యువతిని కూడా చితకబాదారు. కాళ్లతో తన్నుతూ తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. అక్కడున్న వారు అడ్డుకుని.. బాధితుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కరీంనగర్ జిల్లాలో గత కొంతకాలంగా భూ మాఫియా ఆగడాలకు అదుపు లేకుండా పోతోంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని.. బాధితులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
7. బీ అలర్ట్: శ్రీలంకకు అమెరికా హెచ్చరిక
తమ దేశంలో ఈస్టర్ సందర్భంగా జరిగిన మారణహోమం నుంచి శ్రీలంకవాసులు ఇంకా కోలుకోలేదు. ఇప్పటికీ వందల మంది క్షతగాత్రులు లంకలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మరిన్ని పేలుళ్లు జరగొచ్చన్న నిఘావర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు, దేశంలోని అణువణువును నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదులుగా భావించిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా శ్రీలంకను తాజాగా అమెరికా హెచ్చరించింది.
మరో వారం రోజుల వ్యవధిలో శ్రీలంకలో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అగ్రరాజ్యం వెల్లడించింది. ఈ నెల 28వరకు కొలంబోలోని ప్రార్థనాలయాలకు వెళ్లొద్దని శ్రీలంక ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్టు చేసిన అమెరికా అధికారులు.. ‘‘ఎక్కువ మంది జనం గుమికూడిన చోటికి అసలు వెళ్లొద్దు’’ అంటూ పేర్కొన్నారు.
8.నీరవ్కు మూడోసారీ ‘నో’ బెయిల్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరోసారి లండన్ కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఇప్పటికీ మూడుసార్లు ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఇక ఇదే కేసులో తదుపరి విచారణను మే 24కు వాయిదా వేసిన జడ్జి, ఫైనల్ హియరింగ్ను 30న చేపడుతామని తెలిపారు.
కాగా పీఎన్బీ స్కాం కేసులో మార్చి 19న నీరవ్ను అరెస్ట్ చేశారు లండన్ పోలీసులు. దీనిపై విచారణ సందర్భంగా భారత్ తరఫున న్యాయవాది వాదిస్తూ.. నీరవ్కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, దేశం విడిచివెళ్లొచ్చని తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు నీరవ్కు బెయిల్ ఇచ్చేందుకు మళ్లీ నో చెప్పింది.
9.‘కాల భైరవుడి సాక్షి’గా మోదీ నామినేషన్
వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోదీ తన నామినేషన్ను దాఖలు చేశారు. అక్కడి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, లోక్జన్శక్తి అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్, శిరోమణి అకాలీదల్ నేత ప్రకాశ్ సింగ్ ఉన్నారు. అంతకుముందు కాల భైరవ ఆలయంలో మోదీ పూజలు నిర్వహించారు. కాగా వారణాసి నుంచి ఆయన రెండోసారి లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
10.బాబోయ్ ఏప్రిల్ 26.. రాహుల్ పరేషాన్..!
2018 ఏప్రిల్ 26.. సరిగ్గా ఇదే రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఎలాంటి ప్రమాదం లేకపోవడండో సురక్షితంగా బయటపడ్డారు. కరెక్ట్గా ఈ రోజుకు ఏడాది గడిచింది.. 2019 ఏప్రిల్ 26న.. మళ్లీ రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గతంలో మాదిరే మరోసారి ఆయన సురక్షితంగా బయట పడ్డారు. కాగా.. మళ్లీ ఇదే రోజున అదే పరిస్థితి ఎదురవడంతో అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ఘటనపై యథాప్రకారం డీజీసీఏ విచారణకు ఆదేశించింది.
బీహార్లోని సమస్తిపుర్లో ఎన్నికల సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా రాహుల్ గాంధీ విమాన ఇంజిన్కు సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఈ విమానాన్ని ఢిల్లీ మళ్లించారు. ఈ విషయాన్ని రాహుల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. కాగా.. 2018లో కూడా ఎన్నికల ప్రచారానికి కర్ణాటకలోని హుబ్లీ వెళ్తుండగా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ రెండు విమాన ప్రయాణాల్లో రాహుల్కి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.