రికార్డు స్థాయిలో బ్రహ్మాండ నాయకుడి హుండీ ఆదాయం
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకటేశ్వరుడి సన్నిధిలో తిరిగి సందడి మొదలైంది. శనివారం నాడు 13,486 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో స్వామి వారి హూండీ కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది...
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకటేశ్వరుడి సన్నిధిలో తిరిగి సందడి మొదలైంది. శనివారం నాడు 13,486 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో స్వామి వారి హూండీ కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఇవాళ ఒక్కరోజే హుండి ద్వారా కోటి 2 లక్షల రూపాయలు భక్తులు సమర్పించినట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీవారి ఆలయంలో దర్శనాలు పునరుద్ధరణ చేసిన తర్వాత ఇదే అత్యధిక ఆదాయం. అయితే.. ఆదాయంతో పాటు ఇంత పెద్ద స్థాయిలో భక్తులు వెంకన్నను దర్శించుకోవడం కూడా ఇదే మొదటిసారని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. తిరుమలలో దాదాపు 7,400లకు పైగా గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. కరోనాకు ముందు ఈ గదుల కోసం భక్తులు గంటలు తరబడి నిరీక్షించేవారు. గదులు లభించక కొంతమంది యాత్రీకుల వసతి సముదాయాలు, కార్యాలయాల ముందు, ఫుట్పాత్, షెడ్లలో సేదతీరేవారు. ప్రస్తుతం 10వేల మందికి పైగానే భక్తులు తిరుమలకు వస్తున్నప్పటికీ 200 గదులు మాత్రమే అద్దెకు తీసుకుంటున్నారు. తిరుమల చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని పరిస్థితులు కరోనా వల్ల ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. మొక్కులుండి తప్పనిసరిగా వస్తున్న వారు మినహా కుటుంబాలకు కుటుంబాలుగా తరలివచ్చి సందడిగా తిరిగే వారే లేరు.