UK New Coronavirus Strain: స్ట్రెయిన్ వైరస్తో తెలంగాణ సర్కార్ అలర్ట్.. హెల్త్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
యూకేలో వెలుగు చూసిన కొత్త వైరస్ స్ట్రెయిన్తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ముందస్తు చర్యలకు శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు యూకే నుంచి రాకపోకలను నిలిపివేశాయి.
యూకేలో వెలుగు చూసిన కొత్త వైరస్ స్ట్రెయిన్తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ముందస్తు చర్యలకు శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు యూకే నుంచి రాకపోకలను నిలిపివేశాయి. ఇందులో భాగంగా భారత్ కూడా యూకేకు అన్ని ఫ్లైట్లను రద్దు చేసింది. అంతకాకుండా అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.శ్రీనివాస్ వెల్లడించారు.
ఈ మేరకు వైద్య, విద్య సంచాలకులు డా.రమేశ్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. స్ట్రేయిన్ వైరస్కు సంబంధించి కేంద్రం ఇప్పటికే పలు సూచనలు చేసిందని అన్నారు. విదేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. అలాంటి లక్షణాలు ఉన్నవారి కోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో 040-24651119 నంబర్ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు.
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రానికి వచ్చిన వారికి శంషాబాద్ ఎయిర్పోర్టులోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అయితే వారిలో ఎవరికి పాజిటివ్ రాలేదని.. కరోనా లక్షణాలు కూడా లేవని అన్నారు. ఇదే మాదిరిగా గత వారం రోజులుగా రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.