జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
నిజాం కాలంనాటి మున్సిపల్ చట్టానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కొత్త సవరణలను తీసుకువచ్చింది. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది.
నిజాం కాలంనాటి మున్సిపల్ చట్టానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కొత్త సవరణలను తీసుకువచ్చింది. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ చట్టానికి ప్రభుత్వం ఐదు సవరణలు చేసింది. ఈ బిల్లును పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానం ఇచ్చారు. అనంతరం బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
ఐదు సవరణలు ఇవేః
1. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. 2015లో ఒక ప్రత్యేక జీవో ద్వారా కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు 50 శాతం స్థానాలను మహిళలకే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో మహిళా రిజర్వేషన్లకు ఇవాళ చట్టం తీసుకువచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీసీల రిజర్వేషన్లు యధాతథంగా కొనసాగుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
2. జీహెచ్ఎంసీ పరిధిలో 10 శాతం గ్రీన్ బడ్జెట్కు కూడా సభ ఆమోదం తెలిపింది. గతంలో 2.5 శాతం ఉన్న గ్రీన్ బడ్జెట్ను 10 శాతానికి పెంచుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో 5 నుంచి 6 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని కేంద్రం ఓ నివేదిక విడుదల చేసింది. గ్రామాల్లో, పట్టణాల్లో హరితహారం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టంలో 10 శాతం బడ్జెట్ను గ్రీన్ కవర్కు కేటాయించామన్నారు. 85 శాతం మొక్కలు బతకాలనే ఉద్దేశంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగించామన్నారు. పంచాయతీరాజ్, పురపాలక చట్టం మాదిరిగానే జీహెచ్ఎంసీ చట్ట సవరణలో మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి వెల్లడించారు. కాంక్రీట్ జంగిల్గా మారుతున్న నగరాన్ని హరితనగరంగా మార్చాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో ఈ సవరణ తీసుకువచ్చామన్నారు.
3. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లులో భాగంగా 10 ఏళ్లకోసారి రిజర్వేషన్ల మార్పునకు సభ ఆమోదం తెలిపింది. మాటిమాటికి రిజర్వేషన్లు మార్చడం వల్ల ప్రజాప్రతినిధులకు జవాబుదారీ తనం లేకుండా పోతోంది. రెండు టర్మ్లు ఒకే రిజర్వేషన్ ఉండేలా పంచాయతీరాజ్, పురపాలక చట్టంలో తీసుకువచ్చామన్నారు మంత్రి కేటీఆర్. దీని వల్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత చేరువై అభివృద్ధికి అటంకం కలగదన్నారు.
4. నాలుగు రకాల వార్డు వాలంటీర్ల కమిటీల ఏర్పాటుకు సభ ఆమోదం తెలిపింది. ప్రజల భాగస్వామ్యంతోనే నాలుగు రకాల కమిటీలు తీసుకురాబోతున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ కమిటీల్లో 50 శాతం మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శక్తివంతమైన అస్ర్తంగా ఈ కమిటీలను తయారు చేయబోతున్నామని చెప్పారు. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకే వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వార్డు కమిటీల ఏర్పాటు ఉంటుందన్నారు. యూత్ కమిటీ, మహిళా కమిటీ, సినీయర్ సిటిజెన్ కమిటీ,ఎమినెంట్ సిటిజెన్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. కమిటీల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
5. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని ఎస్ఈసీ సంప్రదించాలని జీహెచ్ఎంసీ చట్ట సవరణ చేశారు. దీనికి కూడా సభ ఆమోదం తెలిపింది. ఇకపై, రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతితో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ నిర్వహించేలా సవరణ తీసుకువచ్చినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాతనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేలా చట్ట సవరణ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.