‘హౌస్ అరెస్ట్ లు సీఎం జగన్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం.. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు’ : యనమల
ఆంధ్రప్రదేశ్ కు ఒకే రాజధాని ఉండాలంటూ భూములిచ్చిన అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇవాళ ఏర్పాటు చేసిన..
ఆంధ్రప్రదేశ్ కు ఒకే రాజధాని ఉండాలంటూ భూములిచ్చిన అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇవాళ ఏర్పాటు చేసిన జనభేరి మహాసభకు హాజరుకాకుండా జగన్ ప్రభుత్వం ఆటంకం కలిగిస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. టీడీపీ నేతల్ని గృహ నిర్బంధం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హౌస్ అరెస్ట్ లు సీఎం జగన్ రెడ్డి పిరికితనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి తగిన మూల్యం జగన్ రెడ్డి చెల్లించక తప్పదన్నారు. వైసీపీ ప్రభుత్వ అణచివేత చర్యలను ప్రజాస్వామ్యవాదులంతా గర్హించాలని కోరారు. ప్రశ్నించే గొంతును నొక్కేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుందన్నారు. రాజధాని ఉద్యమం రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుతుందని చెప్పుకొచ్చారు. ఈ ఉద్యమం పెనుఉప్పెనగా మారి వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తుందంటూ మాజీమంత్రి విడుదల చేసిన ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.