టీ20 ప్రపంచకప్ అసాధ్యంః క్రికెట్ ఆస్ట్రేలియా
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహించడం అసాధ్యమని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఐపీఎల్ ను వరల్డ్ కప్ విండోలో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.
కరోనా వైరస్ వల్ల క్రీడా రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పాలి. ఇప్పటికే జరగాల్సిన అనేక టోర్నీలు, మెగా టోర్నమెంట్లు మహమ్మారి కారణంగా రద్దయ్యాయి. ఆఖరికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను కూడా ఈ వైరస్ కారణంగా బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులు ఇస్తుండటంతో మళ్లీ ఫ్యాన్స్ లో ఆశలు మొదలయ్యాయి. ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ స్థానంలో ఐపీఎల్ 13వ సీజన్ ను నిర్వహిస్తారని నెట్టింట్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇక వాటిని నిజం చేసేలా క్రికెట్ ఆస్ట్రేలియా తాజాగా టీ20 ప్రపంచకప్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహించడం అసాధ్యమని ప్రకటించింది. ఆ దేశంలో వచ్చే నెల నుంచి స్టేడియాల్లో నాలుగో వంతు అభిమానులకు అనుమతి ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించాలంటే 16 జట్లను ఆస్ట్రేలియా రప్పించాల్సి ఉంటుంది. ఇక అందులో చాలా దేశాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని.. అందుకే ఈ ఏడాది టోర్నీ నిర్వహించడం కష్టతరమని క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు అధ్యక్షుడు తెలిపాడు. కాగా, ఈ డెషిషన్ తో ఐపీఎల్ ను వరల్డ్ కప్ విండోలో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.