మోదీ మేం చెప్పింది వినడం లేదు.. సోనియా ఆగ్రహం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాము, తమ పార్టీ చెబుతున్న మాటలను అస్సలు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. దేశంలో నిరుద్యోగం దారుణంగా ప్రబలే ప్రమాదం వుందని ఆమె హెచ్చరించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాము, తమ పార్టీ చెబుతున్న మాటలను అస్సలు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. దేశంలో నిరుద్యోగం దారుణంగా ప్రబలే ప్రమాదం వుందని ఆమె హెచ్చరించారు. దేశంలో ప్రతీ వ్యక్తికి వెంటనే 7,500 రూపాయల చొప్పున వారి అకౌంట్లలో మనీ డిపాజిట్ చేయాలని సోనియా గాంధీ ప్రధాన మంత్రిని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సర్వసభ్య సమావేశాన్ని సోనియా గాంధీ గురువారం వీడియో కాన్ఫరెన్సు విధానంలో నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభంలో ఆమె కీలకోపన్యాసం చేశారు. కరోనా నియంత్రణా చర్యల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వేగంగా ఎక్కువ సంఖ్యలో కరోనా నిర్దారణ పరీక్షలు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ సూచనను కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు సోనియా గాంధీ.
‘‘ కరోనా వైరస్ టెస్ట్ కిట్ల కొరత చాలా రాష్ట్రాలలో ఉంది. ఉన్న కిట్లు నాసిరకంగా ఉండలతో పాటు ఫలితాలు సరిగా రావడం లేదు.. దేశంలో వ్యాపారం, వాణిజ్యం , పారిశ్రామిక రంగాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.. వేలాది మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు.. దేశంలో లాక్ డౌన్ వల్ల ముఖ్యంగా రైతులు , కార్మికులు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.. ఉపాధి లేక, సొంత ప్రాంతాలకు వెళ్లలేక వలస కార్మికులు దిక్కుతోచని స్థితిలో నడి రోడ్ల పై నిలబడి ఉన్నారు.. వారికి ఆహార భద్రత, ఆర్ధిక పరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.. ’’ అని సోనియా గాంధీ సీడబ్లూసీ సమావేశంలో వ్యాఖ్యానించారు.
‘‘ లాక్డౌన్ సమయంలో దాదాపు 12 కోట్ల మంది ఉద్యోగాలు కొల్పయారు.. ఆర్థిక కార్యకలాపాలు నిలిచి నిరుద్యోగం మరింత పెరగే అవకాశం ఉంది.. కాబట్టి ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కనీసం రూ.7,500 అందించాల్సిన అవసరం ఉంది.. కరోనా కట్టడికి పరీక్షలు చేయడం, క్వారంటైన్ పంపడం మాత్రమే చేయగలం.. ’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. వేగంగా టెస్టులు నిర్వహించే సామర్థ్యం సాధించాలని, ఉపాధి కోల్పోయిన వారిని వెంటనే ఆర్థిక సాయంతో ఆదుకోవాలని సోనియా డిమాండ్ చేశారు.