Interesting Facts: బావిలో 160 ఏళ్ల నాటి అస్థిపంజరాలు.. 1857 సిపాయి తిరుగుబాటులో సైనికులవని గుర్తింపు.. పరిశోధనలో గుట్టురట్టు..!
Interesting Facts: పంజాబ్లోని అజ్నాలాలో ఓ పాడుబడ్డ బావిలో 2014లో బయటపడ్డ సామూహిక అస్తి పంజరాల గుట్టును అణు, కణ పరిశోధన సంస్థ ఛేదించింది. ఇవి గంగా నది మైదాన ..
Interesting Facts: పంజాబ్లోని అజ్నాలాలో ఓ పాడుబడ్డ బావిలో 2014లో బయటపడ్డ సామూహిక అస్తి పంజరాల గుట్టును అణు, కణ పరిశోధన సంస్థ ఛేదించింది. ఇవి గంగా నది మైదాన ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్ (UP), బీహార్ (Bihar), బెంగాల్ (Bengal)లకు చెందిన అమరవీరులవని తెలిపింది. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఈ అస్తి పంజరాలు 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ సైన్యం చేతిలో మరణించిన భారతీయ సైనికులవని ప్రజల నమ్మకం. అయితే మృతులు భౌగోళిక మూలాలపై శాస్త్రీయ ఆధారాలేమి లేవు. మరో వైపు దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో మరణించిన వారివని చరిత్రకారుల వాదన. ఈ నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలజి (CCMB), పంజాబ్ యూనివర్సిటీ, బీహెచ్యూ తదితర సంస్థలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలలో పాల్గొన్నాయి. శాస్త్రవేత్తల ఆస్తి పంజరాల డీఎన్ఏ, ఐసోటోప్ విశ్లేషణ చేసినప్పుడు ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ రెండు వేర్వేరు శాస్త్రవేత్తల బృందాలు, పరిశోధన, విశ్లేషణ ఆధారంగా బెంగాల్ పదాతిదళ బెటాలియన్కు చెందిన సైనికుల అస్థి పంజరాలని తేలింది.
శాస్త్రవేత్తల ఈ అధ్యయనం పూర్తయిన తర్వాత ఏప్రిల్ 28న ‘ఫ్రాంటియర్స్ ఇన్ జెనెటిక్స్’ అనే పరిశోధనా పత్రికలో కూడా ప్రచురించబడింది. అయితే ఈ అస్థిపంజరాలు భారత్-పాకిస్థాన్ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో మరణించిన వారివని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే 2014లో పంజాబ్లోని అజ్నాలా పట్టణంలోని ఓ బావిలో దొరికిన అస్థిపంజరాలు 1857 తిరుగుబాటులో అమరులైన సైనికులకు చెందినవని అధ్యయనంలో తేలింది.
ఈ అస్థిపంజరాలు పంజాబ్ లేదా పాకిస్థాన్లో నివసించే వ్యక్తులవి కాదనే వాదనకు DNA విశ్లేషణ, ఐసోటోప్ విశ్లేషణ పద్ధతులు మద్దతుగా నిలిచాయని CCMB చీఫ్ సైంటిస్ట్ కె. తంగరాజ్ తెలిపారు. రెండు పద్దతుల్లోనూ పరిశోధన జరుగగా, అస్థి పంజరాలు పంజాబ్ లేదా పాకిస్థాన్లో నివసిస్తున్న వారివి కాదని తేలింది. వాటి డీఎన్ఏ ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్కు చెందిన పూర్వీకులతో సరిపోలాయని డాక్టర్ తుంగరాజ్ తెలిపారు. ఈ ఫలితాలు చారిత్రక ఆధారాలకు అనుగుణంగా ఉన్నాయి. 26వ బెంగాల్ పదాతిదళ బెటాలియన్లో బెంగాల్ తూర్పు భాగం, ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్కు చెందినవారు ఉండేవారు అని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ జె ఎస్ సెహ్రావత్ తెలిపారు. చరిత్రను మరింత సాక్ష్యాల ఆధారంగా చూడడానికి ఈ తరహా పరిశోధనలు దోహదం చేస్తాయని డీఎన్ఏ నిపుణుడు డాక్టర్ నీరజ్రాయ్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: