వచ్చే తమిళనాడు ఎన్నికల్లో రజనీకాంత్, శశికళ మధ్యే పోటీ.. డైలమాలో బీజేపీ, సుబ్రహ్మణ్యస్వామి సంచలన ప్రకటన
సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై సందిగ్ధతకు తెరపడింది. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన..
సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై సందిగ్ధతకు తెరపడింది. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు డిసెంబరు 31న వెల్లడిస్తానని ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. తనకు అండగా నిలచినవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు రజనీ. తమిళనాడు కోసం జీవితాన్ని త్యాగం చేస్తానని, ప్రజల కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సంతోషపడతానని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు రజనీకాంత్. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. “రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా, రారా అనే చర్చ ముగియడం శుభపరిణామం. బహుశా తమిళనాడు ఎన్నికల్లో ఈసారి ప్రధాన పోటీ రజనీకాంత్, శశికళ మధ్యే ఉంటుంది. బీజేపీకి డైలమా తప్పదు” అంటూ సీనియర్ పొలిటీషియన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇదిలాఉండగా, రజనీ ప్రకటనతో తమిళనాట కొత్త రాజకీయ సమీకరణలు షురూ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అధికార ఏఐఏడీఎంకే రజనీకాంత్ తో పొత్తుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఈ దిశగా సంకేతాలిచ్చారు. అయితే, రజనీ ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ముందుకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు కడుతున్నారు.